YS Viveka murder case: హైకోర్టుకు ఎంపీ అవినాష్‌రెడ్డి.. ఆ ఆదేశాలు ఇవ్వండి..

Avinash Reddy

Avinash Reddy

YS Viveka murder case: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ అవినాష్‌రెడ్డి శుక్రవారం సీబీఐ విచారణకు హాజరు కావాల్సి ఉంది. ఉదయం 11గంటలకు ఆయన సీబీఐ ముందుకు రానున్నారు. ఈ విచారణకు సంబంధించి తెలంగాణ హైకోర్టులో రిట్‌ పిటిషన్ దాఖలు చేశారు అవినాష్‌రెడ్డి. వివేకా హత్య కేసులో సీబీఐ తనను విచారించే సమయంలో ఆడియో, వీడియో రికార్డింగ్ చేసేలా సీబీఐని ఆదేశించాలని కోరారు. తన న్యాయవాది సమక్షంలోనే విచారణ చేయాలని విజ్ఞప్తి చేశారు అవినాష్‌రెడ్డి. సీఆర్‌పీసీ సెక్షన్ 160కింద నోటీసులు ఇచ్చారు కనుక కఠిన చర్యలు తీసుకోకుండా సీబీఐకి ఆదేశాలు ఇవ్వాలని కోరారు.

Read Also: Top Headlines @ 9 PM: టాప్‌ న్యూస్‌

వైఎస్‌ వివేకా హత్య కేసులో ఏ4 నిందితుడిగా ఉన్న దస్తగిరిని ఇప్పటికీ సీబీఐ అరెస్ట్‌ చేయలేదన్నారు అవినాష్‌రెడ్డి. దస్తగిరి అక్కడ, ఇక్కడ చెప్పిన మాటల ఆధారంగానే సీబీఐ విచారణ జరుగుతోందన్నారు. తనకు వ్యతిరేకంగా ఎలాంటి సాక్ష్యాలు లేకపోయినా కేసులో ఇరికించే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించిన ఎంపీ.. తాను చెప్పిన విషయాలను కూడా విచారణ అధికారి మార్చేస్తున్నారన్నారు. దర్యాప్తు అధికారి తీరు పక్షపాతంగా ఉందన్నారు. తనే నేరం చేసినట్లు ఊహించుకుని ఆ దిశగానే విచారణ చేస్తున్నారన్నారు. తప్పుడు సాక్ష్యాలు ఇచ్చేలా విచారణాధికారి కొందరిపై ఒత్తిడి చేస్తున్నారన్నారు అవినాష్‌రెడ్డి. గత విచారణకు సంబంధించి కూడా కీలక అంశాలు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు అవినాష్‌రెడ్డి. ఆడియో వీడియో రికార్డు చేయకుండా కేవలం టైప్ మాత్రమే చేశారని అందులో కొన్ని అంశాలను తన ఎదురుగానే విచారణ అధికారి తొలగించారని ఆరోపించారు. తను చెప్పింది రాసుకున్నారో వారికిష్టమైనట్లు రాసుకున్నారో తెలియడం లేదన్నారు. విచారణకు కొన్ని గంటలే ఉండటంతో అవినాష్‌రెడ్డి పిటిషన్‌పై కోర్టు ఎలాంటి ఆదేశాలు ఇస్తుందన్నది ఆసక్తిగా మారింది.