తెలంగాణలో ఇంటింటికీ సురక్షితమైన తాగునీరు అందించాలనే లక్ష్యంతో ప్రారంభమైన ‘మిషన్ భగీరథ’ పథకం నేటితో పదేళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని బిఆర్ఎస్ నాయకుడు, మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆనందం వ్యక్తం చేశారు. మిషన్ భగీరథ ప్రాజెక్టుకు సంబంధించిన ఒక ప్రత్యేక వీడియోను షేర్ చేసిన ఆయన, ఇది కేవలం ఒక ప్రభుత్వ పథకం మాత్రమే కాదని, తెలంగాణ ప్రజల జీవితాల్లో వెలుగులు నింపిన ఒక మహత్తరమైన తాగునీటి విప్లవం అని కొనియాడారు.
దేశానికే ఆదర్శంగా నిలిచిన ప్రాజెక్ట్
సరిగ్గా పదేళ్ల క్రితం ఒక గొప్ప ఆలోచనతో రూపుదిద్దుకున్న ఈ ప్రాజెక్ట్, తెలంగాణ ప్రజల దశాబ్దాల తాగునీటి కష్టాలకు శాశ్వత పరిష్కారం చూపిందని హరీశ్ రావు పేర్కొన్నారు. ప్రతి ఇంటికీ నిరంతరం స్వచ్ఛమైన నల్లా నీరు అందించిన ఈ వ్యవస్థ, దేశంలోనే అతిపెద్ద తాగునీటి మౌలిక వసతుల ప్రాజెక్టుగా చరిత్ర సృష్టించిందని తెలిపారు. ముఖ్యంగా తెలంగాణను దశాబ్దాలుగా పీడించిన ఫ్లోరోసిస్ రక్కసిని శాశ్వతంగా రూపుమాపడంలో ఈ పథకం కీలక పాత్ర పోషించిందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘హర్ ఘర్ జల్’ పథకానికి కూడా మిషన్ భగీరథే రోల్ మోడల్గా నిలిచి, దేశవ్యాప్తంగా అపారమైన ప్రశంసలు అందుకుందని ఆయన గుర్తుచేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యంపై ధ్వజం
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దూరదృష్టికి , ఆచరణాత్మక ఆలోచనలకు మిషన్ భగీరథ ప్రత్యక్ష నిదర్శనమని హరీశ్ రావు అభివర్ణించారు. అయితే, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం చూపిస్తున్న నిర్లక్ష్యం కారణంగా ఈ సుజల వ్యవస్థ నిర్వీర్యమవుతోందని ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో నిరంతరం ప్రవహించిన నల్లాలు ఇప్పుడు ఎండిపోయే పరిస్థితి వస్తోందని, ప్రభుత్వం తక్షణమే స్పందించి ఈ మహత్తర ప్రాజెక్టును సక్రమంగా నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు.
10 Years of #MissionBhagiratha 💧
10 Years of Dignity.
10 Years of Transformation.A decade ago, Telangana embarked on a mission that transformed the lives of millions forever.
Mission Bhagiratha was not just a drinking water project – it was an engineering marvel
Launched… pic.twitter.com/yRrc98lmP0
— Harish Rao Thanneeru (@BRSHarish) August 7, 2026

