Minister Meeting on Ramdan 2022 Arrangements.
ముస్లింలకు ఎంతో పవిత్ర మాసమైన రంజాన్ నెల వచ్చే ఏప్రిల్ 3న ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో మంత్రులు మహముద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, కొప్పుల ఈశ్వర్లు కలిసి డీఎస్ఎస్ భవన్లో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. ముస్లీం సోదరులు ఎంతో పవిత్రంగా భావించే రంజాన్ పండుగకు ప్రభుత్వ పరంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి ప్రతి ఏటా రంజాన్ పర్వదినాన్ని ఘనంగా జరుపుకునేలా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తూ వస్తున్నామని తెలిపారు. పేదలు సైతం పండుగను సంతోషంగా జరుపుకోవాలనే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచన మేరకు నూతన దుస్తుల గిఫ్ట్ ప్యాక్లను పంపిణీ చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఈ సమీక్షా సమావేశానికి హైదరాబాద్ నగరానికి చెందిన టీఆర్ఎస్, ఎంఐఎం పార్టీల ఎమ్మెల్యేలు, మైనార్టీ శాఖ అధికారులు, సీపీ సీవీ ఆనంద్తో పాటు పలువురు హాజరయ్యారు.