NTV Telugu Site icon

రాజీలేకుండా డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం.. ఒక్క రూపాయి అవసరంలేదు..

ఎక్కడ రాజీపడకుండా డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను నిర్మించి లబ్ధిదారులకు అందజేస్తున్నాం.. చక్కగా కాపాడుకోవాలి.. పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు మంత్రి కేటీఆర్.. మ‌ల‌క్‌పేట నియోజ‌క‌వ‌ర్గంలోని పిల్లిగుడిసెలు బ‌స్తీలో నూత‌నంగా నిర్మించిన 288 డ‌బుల్ బెడ్రూం ఇళ్లను ప్రారంభించిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జంగంమెట్‌, బండ్లగూడ‌, ఫారూఖ్‌న‌గ‌ర్‌లో డ‌బుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం వేగ‌వంతం చేసి పేద ప్రజ‌ల‌కు అంద‌జేస్తామ‌న్నారు. పిల్లిగుడిసెల బ‌స్తీలో ఒక‌ప్పుడు మంచినీళ్ల గోస ఉండేది. డ్రైనేజీ స‌రిగా లేక ఇబ్బందులు ప‌డేవారు. ఇప్పుడు ఆ ఇబ్బందులు లేవు అని తెలిపారు.. ఈ ఇళ్లను ప్రైవేట్‌ బిల్డర్ క‌ట్టి ఉంటే.. ఒక్కో ఇల్లు రూ. 50 నుంచి రూ. 60 ల‌క్షల వ‌ర‌కు ఖ‌రీదు చేసి ఉండేదన్న కేటీఆర్.. కానీ, సీఎం కేసీఆర్ నిరుపేద ప్రజ‌లు ఆత్మగౌర‌వంతో బ‌త‌కాల‌నే ఉద్దేశంతో ఉచితంగా ఇళ్లు క‌ట్టించి ఇస్తున్నారని.. నాణ్యత విష‌యంలో రాజీ ప‌డ‌కుండా.. ప‌నులు చేస్తున్నాం. ఇది ఇల్లు కాదు.. పేద వాడి ఆత్మ‌గౌర‌వానికి ప్రతీక అన్నారు.

మరోవైపు.. చంచ‌ల్‌గూడ జైలును ఇక్కడి నుంచి త‌ర‌లించాల‌ని స్థానిక ఎమ్మెల్యే, ఎంపీ ఓవైసీ విజ్ఞప్తిపై స్పందించిన కేటీఆర్.. 34 ఎక‌రాల విస్తీర్ణంలో ఉన్న చంచ‌ల్‌గూడ జైలును త‌ర‌లించి.. ప్రజ‌ల‌కు ఉప‌యోగ‌ప‌డే విధంగా ఇళ్లను కానీ, ఐటీ పార్కు కానీ, విద్యాసంస్థలు కానీ ఏర్పాటు చేయాల‌ని కోరుతున్నారు. ఈ విష‌యాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తామ‌ని వెల్లడించారు. ఇక, ప్రగతి భవన్ లో ఉన్న లిఫ్ట్… ఇక్కడ డబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్స్ లో ఉన్న లిఫ్ట్ కంపెనీ ఒక్కటే నన్న కేటీఆర్.. గ్రేటర్ లో ఇది 25వ డబుల్ బెడ్ రూమ్ సైట్.. హైదరాబాద్ లో లక్ష బెడ్ రూమ్ లు పేద ప్రజలకు సర్కార్ ఇస్తుందన్నారు. చక్కగా కాపాడుకోండి… పరిశుభ్రంగా ఉంచుకోండి.. లాటరీలో వచ్చే వారికి డబుల్ బెడ్ రూమ్ లు కేటాయిస్తారు… ఏ, ఒక్కరికి ఒక్క రూపాయి ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు కేటీఆర్.