Site icon NTV Telugu

Harish Rao: కిషన్‌రెడ్డికి దమ్ముంటే ఒక్క ప్రాజెక్టుకైనా జాతీయహోదా తీసుకురావాలి

తెలంగాణ సీఎం కేసీఆర్‌పై విమర్శలు చేస్తున్న బీజేపీపై మంత్రి హరీష్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ భాష గురించి మాట్లాడే హక్కు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి లేదని హరీష్‌రావు స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యమంలో మాట్లాడుతున్న భాషనే కేసీఆర్ ఈరోజు మాట్లాడుతున్నారని.. తెలంగాణ ప్రజల భాషనే కేసీఆర్ మాట్లాడతారని తెలిపారు. బీజేపీ నేతలదే మతాల మధ్య చిచ్చు పెట్టేలా భాష అని ఆరోపించారు. కేసీఆర్ ఆమ‌ర‌ణ నిరాహార దీక్ష చేసి ఢిల్లీని కూక‌టివేళ్లతో క‌దిలించి తెలంగాణ‌ను సాధించారని హరీష్‌రావు గుర్తుచేశారు.

కేసీఆర్‌ను విమర్శించడం కాదని.. కిషన్‌రెడ్డికి దమ్ముంటే తెలంగాణలోని ఒక్క ప్రాజెక్టుకైనా జాతీయ హోదా తీసుకురావాలని హరీష్‌రావు సవాల్ విసిరారు. అలా చేస్తే అప్పుడు తామే వచ్చి ఎయిర్‌పోర్టులో కిషన్‌రెడ్డికి దండలు వేస్తామన్నారు. న‌దుల అనుసంధానం జ‌రిగితే తెలంగాణ స‌స్యశ్యామ‌లం అవుతుందని కిష‌న్ రెడ్డి అంటున్నారని.. అంటే గోదావ‌రి నీళ్లను కృష్ణాకు, కృష్ణా నుంచి పెన్నాకు, పెన్నా నుంచి కావేరికి నీళ్లను తీసుకుపోతామ‌ని అంటున్నారని… తెలంగాణ నీళ్లను క‌ర్ణాట‌కు, త‌మిళ‌నాడుకు తీసుకుపోతే మ‌నం స‌మ‌ర్థించాలా అని హరీష్‌రావు ప్రశ్నించారు. అస‌లు కిష‌న్ రెడ్డి ఏ రాష్ట్ర ప్రయోజ‌నాల కోసం మాట్లాడుతున్నారో అర్థం కావ‌డం లేదని ఆయన మండిపడ్డారు. కేసీఆర్ భిక్షతోనే కేంద్రమంత్రి పదవి వచ్చిందని కిషన్‌రెడ్డి గుర్తించాలని హరీష్‌రావు హితవు పలికారు.

Exit mobile version