హుజురాబాద్ ఉప ఎన్నికల్లో పొరపాటున బీజేపీ గెలిస్తే పదేళ్ల అభివృద్ధి వెనక్కి పోతుందన్నారు మంత్రి హరీష్రావు.. కరీంనగర్ జిల్లా వీణవంకలో మంత్రి హరీష్ రావు సమక్షంలో పలువురు నేతలు, కార్యకర్తలు టీఆర్ఎస్లో చేరారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హుజురాబాద్ నియోజకవర్గ అభివృద్ధి టీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యం అన్నారు.. ఈ ప్రాంతంలో టీఆర్ఎస్ గెలిస్తే పది సంవత్సరాలు అభివృద్ధి ముందుకెళ్తుంది.. పొరపాటున బీజేపీ గెలిస్తే 10 సంవత్సరాలు అభివృద్ధి వెనక్కి వెళ్తుందన్నారు.. వ్యక్తి ప్రయోజనం ముఖ్యమా.. హుజురాబాద్ ప్రజల ప్రయోజనం ముఖ్యమా? ఒక వ్యక్తికి లాభం జరగాలా..? రెండున్నర లక్షల మంది హుజురాబాద్ ప్రజలకు లాభం జరగాలా..? అనేది మీ ముందు ఉన్న ప్రశ్న అన్నారు..
మరో రెండున్నరేళ్లు టీఆర్ఎస్ అధికారంలో ఉంటుంది.. గెల్లు శ్రీనివాస్ వెనుక ప్రభుత్వం ఉండి అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తుందన్నారు హరీష్రావు.. 2004లో ఈటల రాజేందర్ ఎమ్మెల్యే అభ్యర్థిగా ముద్దసాని దామోదర్ రెడ్డి మీద నిలబడ్డప్పుడు ఉద్యమకారుడేగానీ సర్పంచ్, ఎంపీటీసీ, కౌన్సిలర్ కాదని గుర్తుచేశారు.. ఇక, గెల్లు శ్రీనివాస్ యాదవ్ కు 21 ఏళ్ల ఉద్యమ అనుభవం ఉందని.. టీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిన అనుభవం కూడా ఉందని.. గెల్లు శ్రీనివాస్ యాదవ్ గెలుపులో హుజురాబాద్ అభివృద్ధి దాగి ఉందన్నారు హరీష్రావు… ఈటల రాజేందర్ మళ్లీ గెలిస్తే ప్రతిపక్ష ఎమ్మెల్యే అవుతాడు.. బీజేపీకి ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు.. ఈటల మూడో ఎమ్మెల్యే అవుతాడు.. కానీ, మంత్రి కాదు కదా..? అని వ్యాఖ్యానించారు. హుజురాబాద్ ప్రజలు ఎందుకు నష్ట పోవాలి..? అని ప్రశ్నించిన ఆయన.. టీఆర్ఎస్ పార్టీ ప్రజలకు మేలు చేసింది తప్ప ఎప్పుడూ నష్టం చేయలేదన్నారు.. బీజేపీ అన్ని ధరలు పెంచింది.. విమానాలు, రోడ్లు, రైళ్లను కుదువబెట్టి.. ప్రభుత్వ రంగ సంస్థలను అమ్ముతోందని మండిపడ్డారు హరీష్రావు.. ఉన్న ఉద్యోగాలను ఊడగొట్టిన బీజేపీకి ఓటేద్దామా.. లక్షా 30 వేల ఉద్యోగాలు ఇచ్చి.. మరో 50 వేల ఉద్యోగాలు ఇస్తామన్న టీఆర్ఎస్ కు ఓటేద్దామా ఆలోచించాలని సూచించారు.