కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజీ మరమ్మతులు , పునరుద్ధరణ పనులపై తెలంగాణ ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో ఈనెల 20వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి తాను స్వయంగా మేడిగడ్డ బ్యారేజీని సందర్శించనున్నట్లు రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. ఢిల్లీలో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (NDSA) చైర్మన్ అనిల్ జైన్తో భేటీ అయిన మంత్రి, ప్రాజెక్టు తాజా పరిస్థితిపై సుదీర్ఘంగా చర్చించారు.
Muslim Population: 4 నుంచి 160 వరకు.. ఆ దేశంలో భారీగా పెరిగిన మజీదులు.. పెద్ద ఎత్తున నిరసనలు..
గోదావరి నదికి వరదలు వచ్చేలోగానే మేడిగడ్డ వద్ద సాయిల్ టెస్టింగ్ (మట్టి పరీక్షలు) పూర్తి చేసి, అవసరమైన కొత్త డిజైన్లను రూపొందించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు మంత్రి తెలిపారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చే మార్గదర్శకాలకు అనుగుణంగానే తమ ప్రభుత్వం ముందుకు వెళ్తుందని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యంగా, మేడిగడ్డ డ్యామేజీకి సంబంధించి జరిగే సాయిల్ టెస్ట్ , డిజైన్ల ఖర్చును ప్రభుత్వం భరించబోదని, ఆయా కాంట్రాక్ట్ సంస్థలే భరించాల్సి ఉంటుందని మంత్రి తేల్చి చెప్పారు.
కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన తప్పులను తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు. “బీఆర్ఎస్ హయాంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయింది. దాదాపు 97 వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వెచ్చించి దీనిని నిర్మించారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు కోసం ఏటా 10 వేల కోట్ల రూపాయల వడ్డీ కట్టాల్సి వస్తోంది” అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. భారీ మొత్తంలో ప్రజాధనం ఖర్చు చేసినందున, దానిని ఎలాగైనా రిపేర్ చేసి ప్రజలకు ఉపయోగపడేలా చేయాలన్నదే తమ ప్రభుత్వ ఉద్దేశమని వివరించారు.
కాళేశ్వరం ప్రాజెక్టుపై ముఖ్యమంత్రికి గానీ, తమ ప్రభుత్వానికి గానీ ఎలాంటి రాజకీయ దురుద్దేశాలు లేవని మంత్రి స్పష్టం చేశారు. కేవలం ప్రజల సొమ్ము వృథా కాకూడదనే ఉద్దేశంతోనే పునరుద్ధరణ పనులపై దృష్టి సారించామని చెప్పారు. సాంకేతిక నిపుణుల సలహాలు, ఎన్డీఎస్ఏ నివేదికల ఆధారంగా పారదర్శకంగా ముందుకు వెళ్తామని ఉత్తమ్ కుమార్ రెడ్డి పునరుద్ఘాటించారు.
