ఆర్టీసీ, తపాలా, ఐటీ శాఖల సహకారంతో సమక్క సారక్క ప్రసాదాన్ని ఇంటి వద్దకే డెలివరీ చేసేలా దేవాదాయ శాఖ ఏర్పాట్లు చేసింది. ఫిబ్రవరి 12- 22 వరకు ఆన్ లైన్లో ఇంటికే ప్రసాదం సేవలు అందుబాటులోకి తీసుకురానున్నట్లు దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి వెల్లడించారు. అమ్మవారి ప్రసాదంను డోర్ డెలివరీ చేసేందుకు ఇండియన్ పోస్టల్, ఆర్టీసీ, ఐటీ శాఖల సేవలను వినియోగించుకోనున్నట్లు ఆయన తెలిపారు. అమ్మవారి ప్రసాదం నేరుగా పొందలేని వారికి… భారత పోస్టల్ సర్వీసు , ఆర్టీసీ కొరియర్ సర్వీస్ ద్వారా తమ ఇంటికే చేరవేసేలా ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు.
భక్తుల ఆర్డర్ మేరకు ఇంటి నుంచే బంగారం (బెల్లం) ప్రసాదం అమ్మవారికి సమర్పించే వారి కోసం కూడా ఆర్టీసీ సంస్థ భక్తుల ఇంటికి వచ్చి ప్రసాదాన్ని తీసుకుని వెళ్ళి అమ్మవారికి సమర్పించి మళ్లీ దాన్ని భక్తులకు అందేజేయనున్నట్లు వెల్లడించారు. ఈ సేవను ఆన్ లైన్ లో మీ సేవ లేదా టీయాప్ ఫోలియో (TAPP-FOLIO)లో బుక్ చేసుకోవాలన్నారు. అనంతరం వారికి పోస్టల్ సేవల ద్వారా ప్రసాదాన్ని డోర్ డెలివరీ చేస్తారని తెలిపారు. ఈ సేవలకు గాను ఒక ప్రసాదం ప్యాకెట్ కు భక్తులు రూ. 225 చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. 200 గ్రాముల బెల్లం ప్రసాదం, పసుపు కుంకుమ, అమ్మవారి ఫోటో ను భక్తులకు ఇంటి వద్ద అందజేస్తామన్నారు.