మణికొండలోని డాలర్ హిల్స్లో శనివారం లిఫ్ట్ ప్రమాదం చోటుచేసుకుంది. ఒక అపార్ట్మెంట్లో లిఫ్ట్ వైర్లు ఒక్కసారిగా తెగిపోవడంతో అందులో ప్రయాణిస్తున్న ఆరుగురు బీఆర్ఎస్ నాయకులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించడమే కాకుండా అపార్ట్మెంట్లోని నివాసితులను భయాందోళనకు గురిచేసింది.
డాలర్ హిల్స్లోని ఒక అపార్ట్మెంట్ ఐదవ అంతస్తులో రాజేంద్ర నగర్ నియోజకవర్గం ఇంచార్జీ కార్తీక్ రెడ్డి చేయబోయే పాదయాత్ర కు సన్నాహక సమావేశం జరిగింది. ఈ మీటింగ్ ముగించుకుని ఆరుగురు నాయకులు గ్రౌండ్ ఫ్లోర్కు వెళ్లేందుకు లిఫ్ట్ ఎక్కారు. లిఫ్ట్ కిందకు దిగుతున్న సమయంలో ఒక్కసారిగా సాంకేతిక లోపం తలెత్తి, వైర్లు తెగిపోయాయి. దీంతో లిఫ్ట్ నేరుగా ఐదో అంతస్తు నుండి కిందకు కుప్పకూలిపోయింది. లోపల ఉన్న వారు ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే ప్రమాదం జరిగిపోయింది.
ఈ ప్రమాదంలో లిఫ్ట్లో ఉన్న ఆరుగురు నాయకులకు గాయాలు కాగా, ఇద్దరి పరిస్థితి అత్యంత తీవ్రంగా ఉన్నట్లు సమాచారం. లిఫ్ట్ వేగంగా కిందకు పడటంతో ప్రభావం ఎక్కువగా ఉండి ఇద్దరి కాళ్లు విరిగినట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన వెంటనే అపార్ట్మెంట్ వాసులు, ఇతర నాయకులు స్పందించి క్షతగాత్రులను బయటకు తీశారు. తీవ్రంగా గాయపడ్డ ఇద్దరిని అత్యవసర చికిత్స నిమిత్తం జూబ్లీహిల్స్లోని అపోలో ఆసుపత్రికి తరలించారు.
