మహబూబాబాద్ జిల్లాలో శనివారం తెల్లవారుజామున ఒక పెద్ద రైలు ప్రమాదం తృటిలో తప్పింది. కేసముద్రం మండలం ఇంటికన్నె రైల్వే స్టేషన్ సమీపంలోని గేట్ నంబర్ 75 వద్ద ఈ ఆందోళనకర ఘటన చోటుచేసుకుంది. తెల్లవారుజామున సుమారు 3 గంటల ప్రాంతంలో గేట్మెన్ నిర్లక్ష్యం కారణంగా ట్రాక్పై సిగ్నల్ ఫుట్బ్యాక్ అయింది. దీనిని గమనించిన రైలు లోకో పైలట్ (డ్రైవర్) అత్యంత అప్రమత్తంగా వ్యవహరించి, సమయస్ఫూర్తితో సడెన్ బ్రేక్ వేశారు. లోకో పైలట్ చాకచక్యంగా రైలును నిలిపివేయడంతో ఒక పెద్ద ప్రమాదం తప్పిందని, ఈ ప్రమాద విప్లవం నుండి ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారని రైల్వే వర్గాలు తెలిపాయి. అయితే ఈ ఘటన తెల్లవారుజామున జరిగినా, ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఒక్కసారిగా రైలుకు సడెన్ బ్రేకులు పడటంతో నిద్రలో ఉన్న ప్రయాణికులు తీవ్ర భయాందోళనలకు గురై ఉలిక్కిపడ్డారు. ప్రమాదం తప్పిందని తెలుసుకున్న తర్వాత వారంతా ఊపిరి పీల్చుకున్నారు. కాగా, వందలాది మంది ప్రయాణికుల ప్రాణాలతో ముడిపడి ఉన్న విధుల్లో ఘోర నిర్లక్ష్యం వహించిన గేట్మెన్ తీరుపై రైల్వే ఉన్నతాధికారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాథమిక విచారణ అనంతరం సదరు గేట్మెన్ను తక్షణమే విధుల్లో నుంచి సస్పెండ్ చేస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఘటనపై రైల్వే రక్షణ దళం, ఉన్నతాధికారులు పూర్తిస్థాయి విచారణకు ఆదేశించారు.

