సాధారణంగా మనం చెప్పులు లేకుండా నడవడమే చాలా కష్టంగా ఉంటుంది. అలాంటిది ఓ కళాకారిణి ఏకంగా చెప్పులు లేకుండా 9,999 మేకులపై కూచిపూడి నృత్యం చేసి అందరినీ అబ్బురపరిచింది. అంతేకాకుండా పలు ప్రపంచ రికార్డులను కూడా తన ఖాతాలో వేసుకుంది. హైదరాబాద్లోని పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ ఎన్టీఆర్ కళామందిరంలో జరిగిన ఓ కార్యక్రమంలో యువ నర్తకి పీసపాటి లిఖిత 9 నిమిషాలపాటు అమ్మవారిని స్తుతిస్తూ చేసిన కూచిపూడి నృత్యం అలరించింది.
ముఖ్యంగా తొమ్మిది దుర్గావతారాలను లయబద్ధంగా కళ్లకు కట్టినట్లు చూపింది. దీంతో ఒకేసారి పది ప్రపంచ రికార్డులను సాధించింది. ఆయా రికార్డుల ప్రతినిధులు ఆమెకు సర్టిఫికెట్లు అందించి ఘనంగా సత్కరించారు. కాగా ఎన్టీఆర్ కళామందిరంలో నిర్వహించిన వరల్డ్ రికార్డ్స్, భారత్ వరల్డ్ రికార్డ్స్, టాలెంట్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్, ట్రెడిషనల్ వరల్డ్ రికార్డ్స్, వండర్ ఇండియా రికార్డ్స్, ఢిల్లీ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్, సంస్కృతి సంప్రదాయ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్, సకల కళాకారుల ప్రపంచ పుస్తకం, ఎక్స్ట్రాడినరీ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్, ప్రైడ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ కోసం యువ నర్తకి లిఖిత కూచిపూడి నృత్యం చేసింది.
