రెడ్లకు పగ్గాలు ఇస్తేనే మేము అధికారంలోకి వస్తాం అని రేవంత్ రెడ్డి అంటున్నారు. కుల పిచ్చి వాళ్ళు కావాలా? అన్ని కులాల వాళ్ళు కావాలనే కేసీఆర్ కావాలా? అంటూ మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. ఖమ్మం జిల్లా లకారం చెరువుపై నిర్మించిన కేబుల్ వంతెనను మంత్రి పువ్వాడ అజయ్తో కలిసి మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. రూ. 11.75 కోట్లతో తీగల వంతెనను నిర్మించారు. మ్యూజికల్ ఫౌంటైన్, ఎల్ఈడీ లైటింగ్ను ప్రారంభించారు.
రఘునాథపాలెంలో రూ. 2 కోట్లతో నిర్మించిన ప్రకృతి వనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సభలో కేటీఆర్ ప్రసంగించారు. కులం ఒక్కటే ఓట్లు వేస్తే కుల సంఘానికి నాయకుడు అవుతాడు. విద్వంసం తప్ప మరే దానిమీద బీజేపీకి చిత్తశుద్ధి లేదు. ఎవరి దేవుడైనా దేవుడే. పర మతాన్ని గౌరవించడం నేర్చుకోవాలని మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. కులం, మతం పేరిటి చిల్లర మల్లర రాజకీయాలు చేస్తూ, పచ్చగా ఉన్న దేశంలో చిచ్చుపెట్టి, ఆ చిచ్చులో చలి మంటలను కాచుకోని, నాలుగు ఓట్లు దండుకోవాలని చూస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు.
మన దేశంలో ఇవాళ ఏం జరుగుతుందో యువత ఆలోచించాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ఐటీ, మున్సిపాలిటీ శాఖ మంత్రి కేటీఆర్ సూచించారు. ప్రపంచంలో జరుగుతున్న చర్చ గురించి అందరూ ఆలోచించాలి. నిన్న ప్రార్థనల అనంతరం 25 కోట్ల మంది ముస్లిం సోదరులు దేశ వ్యాప్తంగా నిరసనలు చేపట్టారు. ఎందుకీ విపరీత ధోరణులు కనిపిస్తున్నాయి.
చిల్లరమల్లర మాటలు మాట్లాడుతున్నది ఎవరో ఆలోచించాలి. కరెంట్, నీళ్లు లేని గ్రామాల గురించి ఆలోచించాలి. పిల్లల ఉద్యోగాల గురించి ఆలోచించాలన్నారు. సవ్యమైన పద్ధతుల్లో ముందుకు పోతేనే అభివృద్ధి సాధ్యమవుతుందని కేటీఆర్ స్పష్టం చేశారు. ఒకే ఒక్క రోజు రూ. 100 కోట్లతో నిర్మించిన అభివృద్ధి కార్యక్రమాలు ఇవాళ ఖమ్మంలో ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందని కేటీఆర్ తెలిపారు.
KTR: ఓట్లు కోసం పచ్చగా ఉన్న దేశంలో చిచ్చుపెట్టారు