తెలంగాణ మంత్రివర్గం నుంచి తనను బర్తరఫ్ చేయడంపై మాజీ మంత్రి కొండా సురేఖ మీడియా వేదికగా తీవ్రంగా స్పందించారు. తనను మంత్రి పదవి నుంచి తొలగించడంపై బాధ లేదు కానీ, కనీసం ముందస్తు సమాచారం ఇవ్వకుండా, తన వివరణ కోరకుండానే ఈ నిర్ణయం తీసుకోవడం తీవ్రంగా కలిచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కక్షపూరితంగా వ్యవహరించి తనపై చర్యలు తీసుకోవడం బాధాకరమని, తన మాజీ ఓఎస్డీ సుమంత్పై నమోదు చేసిన కేసును వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
గతంలో పార్టీని తిట్టిన వారిపై చర్యలేవి?
కాంగ్రెస్ పార్టీ తీరును తప్పుపట్టిన కొండా సురేఖ, గతంలో పలువురు సీనియర్ నేతలు పార్టీని విమర్శించినా లేని చర్యలు తనపైనే ఎందుకు తీసుకుంటున్నారని ప్రశ్నించారు. “గతంలో మల్లు రవి కూడా పార్టీని తిట్టారు, రోశయ్య సైతం ‘విధవ రాజ్యం ఏలుతోంది’ అని వ్యాఖ్యానించారు, టీపీసీసీ అధ్యక్ష పదవిని ₹50 కోట్లు పెట్టి కొన్నారని మాట్లాడిన వారిపై ఎలాంటి చర్యలు లేవు” అని గుర్తుచేశారు. నిన్నటికి నిన్న పార్టీకి నష్టం కలిగించేలా కొందరు మాట్లాడినా వారిపై ఎలాంటి యాక్షన్ తీసుకోలేదని, కానీ తన విషయంలో మాత్రం ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నారని మండిపడ్డారు.
సహాయం పొందినవారే నేడు విమర్శిస్తున్నారు
తమ నియోజకవర్గానికి వచ్చి తమ కాళ్లు మొక్కి, నియోజకవర్గం అంతా తిరిగిన వారే ఈరోజు తమపై విమర్శలు చేస్తున్నారని కొండా సురేఖ ఆగ్రహం వ్యక్తం చేశారు. “మా నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్సీ మాటను ఆయన భార్యే వినదు, కానీ ఆయన కూడా ఈరోజు మా గురించి మాట్లాడుతున్నారు” అని ఎద్దేవా చేశారు. పార్టీలోని ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు అయినా ప్రశాంతంగా, సంతోషంగా ఉన్నారా అని ప్రశ్నించిన ఆమె, అందరూ తమ గుండెల మీద చేయి వేసుకుని చెప్పాలని, బయటకు వచ్చి తమ సమస్యలను బహిరంగంగా మాట్లాడాలని పిలుపునిచ్చారు.
సీఎంను కలవడానికి సమయం దొరకదు
ప్రభుత్వ పనితీరుపై తీవ్ర విమర్శలు గుప్పించిన సురేఖ, ముఖ్యమంత్రిని కలవడానికి కనీసం సమయం కూడా దొరకడం లేదని ఆరోపించారు. సీఎం ప్రెజెంటేషన్లు లేదా పిటిషన్లు అసలు తీసుకోరని, తీసుకున్నా సంతకాలు చేయరని, ఒకవేళ సంతకం చేసినా ఆ పనులు కావని విమర్శించారు. ప్రభుత్వం తన నిర్ణయంపై పునరాలోచన చేయాలని తాను అడగనని, అయితే నగర కార్పొరేషన్ ఎన్నికలు వస్తున్న తరుణంలో సీఎం తన పద్ధతిని మార్చుకోవాలని సూచించారు. “ఆయనకు ఆయనే సీఎంగా చెప్పుకోవడం తప్పు కాదా?” అని ప్రశ్నించిన ఆమె, రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ గట్టెక్కాలంటే అందరినీ కలుపుకొనిపోవాలని, ఇష్టారాజ్యంగా మోనోపోలీగా వ్యవహరించడం సరైన పద్ధతి కాదని హితవు పలికారు. అలాగే, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు తాను పంపిన రహస్య లేఖను బయట ఎవరికీ ఇవ్వలేదని కొండా సురేఖ స్పష్టం చేశారు.

