వరంగల్ రాజకీయ పరిణామాల నేపథ్యంలో కొండా మురళీ కీలక వ్యాఖ్యలు చేశారు. తమపై జరుగుతున్న రాజకీయ దాడులపై ఆయన తీవ్రస్థాయిలో స్పందించారు. ఉన్నది ఉన్నట్టుగా, కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడటం తమకు కొత్తేమీ కాదని, అయితే అలాంటి మాటలను ప్రతి ఒక్కరూ తట్టుకోలేరని వ్యాఖ్యానించారు. పదవులు శాశ్వతం కాదని కొండా మురళీ అన్నారు. ఇవాళ తాము పదవుల్లో ఉండొచ్చని, రేపు మరొకరు ఆ స్థానాల్లో ఉండొచ్చని పేర్కొన్నారు. పదవులు ఉన్నా లేకపోయినా తమ గౌరవం తమకు ఉంటుందని స్పష్టం చేశారు.
తాము ప్రతిదానికీ వెంటనే స్పందించకపోవచ్చని, అయితే జరుగుతున్న ప్రతి పరిణామాన్ని నిశితంగా గమనిస్తూనే ఉంటామని కొండా మురళీ అన్నారు. తమ మౌనాన్ని బలహీనతగా భావించవద్దని పరోక్షంగా హెచ్చరించారు. తమపై జరుగుతున్న రాజకీయ దాడులపై ఆయన ఘాటుగా స్పందిస్తూ.. ‘‘అన్ని దరిద్రాలు ఏకమై మా మీద చేస్తున్న, చేసిన రాజకీయ దాడులకు దృఢంగా నిలబడతాం. మొండిగా ఎదురు వెళ్లగలం’’ అని వ్యాఖ్యానించారు. ఎలాంటి ఒత్తిళ్లు వచ్చినా వెనక్కి తగ్గబోమని ఆయన వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి.

