Mother Love: కొమరం భీం జిల్లాలో హృదయాన్ని కదిలించే ఘటన వెలుగులోకి వచ్చింది. సిర్పూర్ మండలం పరిధిలోని ఇటికల పహాడ్ అటవీ ప్రాంతంలో ఓ తల్లి ఆవు తన దూడపై చూపిన ప్రేమ ఇప్పుడు అందరినీ భావోద్వేగానికి గురిచేస్తుంది. ఇటికల పహాడ్ గ్రామానికి చెందిన నగోసే భీంరావు ఆవు, తన లేగ దూడతో కలిసి మేత కోసం అటవీ ప్రాంతానికి వెళ్లింది. అక్కడ ప్లాంటేషన్ సమీపంలో అకస్మాత్తుగా పులి దాడి చేయడంతో దూడ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. దీనితో సాయంత్రం తల్లి ఆవు మాత్రం ఒంటరిగా ఇంటికి చేరింది.
Student Suicide: చిన్నపాటి గొడవ.. 3వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి!
దూడ కనిపించకపోవడంతో ఆవు అటూ ఇటూ తిరుగుతూ, మౌనంగా విలపించడం యజమాని భీంరావు గమనించాడు. అనుమానం కలిగిన ఆయన వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించాడు. మరుసటి రోజు ఫారెస్ట్ రేంజ్ అధికారి ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో అటవీ సిబ్బంది గ్రామానికి చేరుకున్నారు. యజమాని కట్టేసిన ఆవును విడిచిపెట్టగా.. ఆ తల్లి ఆవు ఎక్కడ తడబడకుండా నేరుగా తన దూడ మృతి చెందిన ప్రదేశం వైపు నడిచింది. అధికారులు, సిబ్బంది ఆవు వెంట వెళ్లగా.. పులి దాడి జరిగిన స్థలానికి తీసుకెళ్లింది.
Bhadradri Kothagudem: నాలుగు నెలల క్రితం యువకుడి పేరుతో రూ.కోటి బీమా.. ఆ సొమ్ము కోసం హత్యకు యత్నం
దీనితో అధికారులు చుట్టుపక్కల పరిశీలనలో పులి దాడి కారణంగానే దూడ మృతి చెందినట్లు అధికారులు నిర్ధారించారు. ఈ ఘటనతో యజమానికి తక్షణ పరిహారం అందజేస్తామని అటవీ శాఖ హామీ ఇచ్చింది. అదేవిధంగా పశువుల కాపరులు దట్టమైన అటవీ ప్రాంతాల్లోకి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచనలు చేశారు. తన బిడ్డను కోల్పోయిన ప్రదేశానికే మరుసటి రోజు అధికారులను తీసుకెళ్లిన ఆ తల్లి ఆవు ప్రవర్తన గ్రామస్తులను మాత్రమే కాకుండా అధికారులను కూడా ఆశ్చర్యానికి గురిచేసింది. తల్లి ప్రేమకు ఇదొక హృదయాన్ని హత్తుకునే ఉదాహరణగా నిలిచింది.