తెలంగాణలో భారీ ఎత్తున పెట్టుబడి పెట్టేందుకు కిటెక్స్ గ్రూప్ సుముఖత వ్యక్తం చేసింది. కిటెక్స్ గ్రూప్ ప్రతినిధి బృందం ఇవాళ తెలంగాణలో పర్యటించింది. రాష్ట్ర ప్రభుత్వ ఆహ్వానంపై హైదరాబాద్ చేరుకున్న కంపెనీ ఎండీ సాబు జాకబ్, ఇతర సీనియర్ ప్రతినిధి బృందం… మంత్రి కేటీఆర్తో సమావేశమైంది. తెలంగాణలో ఉన్న పరిశ్రమల స్నేహపూర్వక వాతావరణాన్ని, ప్రభుత్వ పాలసీలను కేటీఆర్ వారికి వివరించారు. టీఎస్ ఐపాస్ ద్వారా సింగిల్ విండో అనుమతులు, తనిఖీల విధానం, పరిశ్రమలకు నిరంతరాయ విద్యుత్ సరఫరా, రాష్ట్రంలో సాగవుతున్న అత్యుత్తమ కాటన్ వంటి అంశాలను తెలిపారు. కంపెనీ ప్రతిపాదిస్తున్న పెట్టుబడికి తమ టీఎస్ ఐపాస్ చట్టప్రకారం మెగా ప్రాజెక్ట్ హోదా లభిస్తుందని వివరించారు. దీని ప్రకారం టైలర్ మేడ్ ప్రోత్సాహకాలు ఇచ్చేందుకు అవకాశం ఉందని కంపెనీకి ప్రభుత్వం తెలిపింది. ఇక, పిల్లల వస్త్రాల తయారీలో ప్రంపంచంలోనే రెండో అతిపెద్ద సమూహం అయిన కిటెక్స్.. రాష్ట్రంలో రూ.వెయ్యి కోట్ల పెట్టుబడి పెట్టేందుకు సిద్ధమైనందుకు సంతోషంగా ఉందని సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు మంత్రి కేటీఆర్.. వారు తమ కర్మాగారాల కోసం వరంగల్లోని కేఎంటీపీని ఎంచుకున్నారని.. త్వరగా నిర్ణయం తీసుకున్నందుకు కిటెక్స్ గ్రూప్కు ధన్యవాదాలు తెలియజేశారు.