టెట్ (టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్) నిర్వహణకు సిద్ధం అవుతుంది తెలంగాణ ప్రభుత్వం.. ఈ నెల 12వ తేదీన టెట్ నిర్వహించనున్నారు.. అదే రోజు ఆర్ఆర్బీ పరీక్ష ఉండడంతో టెట్ వాయిదా వేయాలనే డిమాండ్ కూడా వినిపిస్తోంది. అయితే, టెట్ అనుకున్న ప్రకారం 12వ తేదీన నిర్వహించేందుకు సిద్ధం అయ్యింది సర్కార్.. ఆదివారం రోజు టెట్ నిర్వహించనుండడంతో.. డైరెక్టర్, SCERT మరియు కన్వీనర్ TS-TET-2022 కీలక ప్రకటన చేశారు. మొత్తం 33 జిల్లాల్లో రెండు సెషన్లలో టెట్ జరుగుతుంది.. పేపర్-I ఉదయం, పేపర్-II సాయంత్రం ఉంటుందని.. పేపర్ I ఉదయం 9.30 నుండి మధ్యాహ్నం 12.00 వరకు.. పేపర్ II మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 వరకు నిర్వహించనున్నట్టు వెల్లడించారు. 3,80,589 మంది దరఖాస్తుదారులలో 3,61,205 మంది ఇప్పటి వరకు డౌన్లోడ్ చేసుకున్నట్టు తెలిపారు.
ఇక, టెట్ నిర్వహణకు రాష్ట్రవ్యాప్తంగా 2,683 కేంద్రాలు ఏర్పాటు చేశాం.. 6,29,352 మంది అభ్యర్థులు హాజరవుతున్నట్టు టెట్ కన్వీనర్ ప్రకటించారు.. పేపర్ I.. 3,51,468 మంది అభ్యర్థులకు 1,480 కేంద్రాల్లో.. పేపర్ II.. 2,77,884 మంది అభ్యర్థులకు 1,203 కేంద్రాల్లో జరగనుంది. పరీక్షల నిర్వహణకు చీఫ్ సూపరింటెండెంట్ల సంఖ్య 1480గా ఉండగా.. డిపార్ట్మెంటల్ అధికారుల సంఖ్య 1480, హాల్ సూపరింటెండెంట్ల సంఖ్య 13,415, ఇన్విజిలేటర్ల సంఖ్య 29,513గా.. ఫ్లయింగ్ స్క్వాడ్స్ / రూట్ ఆఫీసర్ల సంఖ్య 252గా ఉంది. జిల్లా కలెక్టర్లు, జిల్లా విద్యాశాఖాధికారులు పరీక్షా కేంద్రాల నిర్వహణ, వసతి, ఫర్నీచర్, చీఫ్ సూపరింటెండెంట్ గదిలో సీసీ కెమెరాలు, నిరంతర విద్యుత్ సరఫరా తదితర అన్ని ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు.
మరోవైపు, అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు జరుగుతున్నాయి.. పరీక్షా కేంద్రాలలో ఒక ఏఎన్ఎం, అవసరమైన వైద్య సహాయం అందించడానికి.. ఓఆర్ఎస్ ప్యాకెట్లు , ఇతర ప్రథమ చికిత్స మందులను వైద్య శాఖ అవసరమైన చర్య తీసుకుంది. అభ్యర్థులు సకాలంలో కేంద్రాలకు చేరుకోవడానికి వీలుగా పరీక్షా కేంద్రాల రూట్లలో ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. పరీక్షా కేంద్రాలకు పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడంతోపాటు స్టోరేజీ పాయింట్ల వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు. పరీక్ష సజావుగా నిర్వహించేందుకు ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు జిల్లా స్థాయి పరిశీలకులను నియమించారు అధికారులు.
టెట్ అభ్యర్థులకు సూచనలు:
* పరీక్ష రోజు కేంద్రానికి చేరుకోవడంలో ఆలస్యం జరగకుండా ఉండేందుకు అభ్యర్థులు పరీక్ష రోజుకి ఒకరోజు ముందు సెంటర్ చిరునామాను తెలుసుకోవాలి.
* అభ్యర్థులు పరీక్ష షెడ్యూల్కు కనీసం ఒక గంట ముందుగానే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలి.
* అభ్యర్థులు కేటాయించిన కేంద్రంలో మాత్రమే పరీక్ష రాయడానికి అనుమతించబడతారు.
* అభ్యర్థులు (02) బ్లాక్ బాల్ పాయింట్ పెన్నులు, హాల్ టికెట్ తీసుకురావాలి.
* మొబైల్స్, ఎలక్ట్రానిక్ గాడ్జెట్లు, బ్యాగ్లు మొదలైనవాటిని కేంద్రంలోకి అనుమతించరు.
* టెట్ 2022కి హాజరయ్యే అభ్యర్థులు హాల్ టిక్కెట్పై ముద్రించిన సూచనలను జాగ్రత్తగా చదవాలి.
*ముందుగా ముద్రించిన ఓఎంఆర్ షీట్లో అందించిన సర్కిల్లను షేడ్ చేయడానికి బ్లాక్ బాల్ పాయింట్ పెన్ను ఉపయోగించాలి.
* ఓఎంఆర్ షీట్ను మడవకండి, చింపివేయవద్దు, ముడతలు పడొద్దు, స్టేపుల్ చేయవద్దు.
*సైడ్-IIలో బార్కోడ్ మరియు బ్లాక్ రిఫరెన్స్ పాయింట్ను తారుమారు చేయవద్దు.
* ఓఎంఆర్ షీట్లో అందించిన తగిన పెట్టె వద్ద బుక్ లెట్ కోడ్ను షేడ్ చేయండి, లేకుంటే సమాధానాలకు విలువ ఇవ్వబడదు మరియు సమాధానం ఇవ్వబడనట్లుగా పరిగణించబడుతుంది.
* ప్రశ్నకు సమాధానమివ్వడం కోసం ఓఎంఆర్ షీట్లో అందించిన సర్కిల్ను పూర్తిగా షేడ్ చేయండి.. లేకపోతే సమాధానం చెల్లదని టెట్ కన్వీనర్ తన ప్రకటనలో స్పష్టం చేశారు.