Kavitha : హైదరాబాద్లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. చిక్కడపల్లి సిటీ సెంట్రల్ లైబ్రరీ వద్ద బీహెచ్ఆర్ఎస్ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకు పోలీసులు అడ్డుపడ్డారు. గ్రూప్-1 పరీక్షల్లో జరిగిన అవకతవకలు, నిరుద్యోగ సమస్యలపై విద్యార్థులతో చర్చించేందుకు కవిత లైబ్రరీకి వెళ్లగా, పోలీసులు ఆమెను ఆపేశారు. అయితే, లైబ్రరీలోకి అనుమతి ఇవ్వకపోవడంతో జాగృతి నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. లైబ్రరీ గేటు బద్దలు కొట్టి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. కవితతో పాటు ఉన్న జాగృతి కార్యకర్తలు విద్యార్థుల సమస్యలపై చర్చించేందుకు మాత్రమే వచ్చామని, అనవసరంగా అడ్డుకోవడం సరికాదని విమర్శించారు. పోలీసులు మాత్రం చట్టం ప్రకారం చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఈ ఘటనతో చిక్కడపల్లి సిటీ సెంట్రల్ లైబ్రరీ పరిసరాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.