ఉమ్మడి కరీంనగర్ జిల్లా రాజకీయాల్లో అత్యంత సీనియర్ నేత, కాంగ్రెస్ పార్టీ విధేయుడిగా పేరున్న జీవన్ రెడ్డి తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. జగిత్యాల నియోజకవర్గంలో చోటుచేసుకున్న రాజకీయ పరిణామాల పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్న ఆయన, పార్టీని వీడేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆయనను బుజ్జగించేందుకు రాష్ట్ర మంత్రులు జరిపిన రాయబారం విఫలమవ్వడం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది.
జీవన్ రెడ్డిని శాంతింపజేసేందుకు మంత్రులు శ్రీధర్ బాబు , అడ్లూరి లక్ష్మణ్ ఆయన నివాసానికి చేరుకున్నారు. సుమారు గంటన్నర పాటు సుదీర్ఘంగా చర్చలు జరిపినప్పటికీ, జీవన్ రెడ్డి తన పట్టు వీడలేదు. చర్చల అనంతరం ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో పెను సంచలనాన్ని సృష్టిస్తున్నాయి. “దేవుడు శాసిస్తాడు.. మానవుడు అనుసరిస్తాడు” అని పేర్కొంటూ, తన తదుపరి అడుగుపై స్పష్టమైన సంకేతాలిచ్చారు.
Aishwarya Lekshmi: పెళ్లి కంటే అదే బెటర్.. హీరోయిన్ షాకింగ్ స్టేట్మెంట్!
మంత్రులతో చర్చల తర్వాత కూడా జీవన్ రెడ్డి తన పాత నిర్ణయానికే కట్టుబడి ఉన్నట్లు స్పష్టమవుతోంది. తాను అనుకున్న తేదీలోనే భవిష్యత్తు కార్యాచరణను వెల్లడిస్తానని, అప్పటివరకు వేచి చూడాలని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే ఆయన తన నివాసంలోని వ్యక్తిగత వస్తువులు, పుస్తకాలు , లైబ్రరీని షిఫ్ట్ చేసే పనుల్లో నిమగ్నమైనట్లు సమాచారం.
జగిత్యాల రాజకీయాలకు స్వస్తి చెప్పి, హైదరాబాద్కు తన నివాసాన్ని మార్చే యోచనలో జీవన్ రెడ్డి ఉన్నట్లు తెలుస్తోంది. పార్టీలో తన ఆత్మగౌరవానికి భంగం కలిగిందనే ఆవేదనతో ఉన్న ఆయన, కాంగ్రెస్తో దశాబ్దాల అనుబంధాన్ని తెంచుకోవడానికే మొగ్గు చూపుతున్నట్లు సన్నిహిత వర్గాల ద్వారా తెలుస్తోంది. ఒకవేళ జీవన్ రెడ్డి పార్టీని వీడితే, అది ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి కోలుకోలేని దెబ్బ అవుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.