Indiramma Indlu : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ఇందిరమ్మ ఇండ్లు టవర్స్’ పథకం దరఖాస్తు గడువును పెంచుతూ గృహ నిర్మాణ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. అర్హులైన లబ్ధిదారులు దరఖాస్తు చేసుకోవడానికి ఈ అవకాశాన్ని ఆగస్టు 15 వరకు పొడిగించినట్లు గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. వరుస సెలవులు రావడంతో ప్రజలకు దరఖాస్తు చేసుకోవడంలో ఎలాంటి ఇబ్బందులు కలగకూడదనే ఉద్దేశంతోనే మరో ఐదు రోజుల పాటు గడువును పెంచినట్లు ఆయన స్పష్టం చేశారు.
ఇప్పటివరకు 46 వేలకు పైగా దరఖాస్తులు..
ఈ పథకానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ప్రభుత్వం అందించిన సమాచారం ప్రకారం ఇప్పటివరకు 46,121 దరఖాస్తులు నమోదయ్యాయి. ఈ గడువు పొడిగింపు ద్వారా మరికొందరు నిరుపేదలు, అర్హులైన లబ్ధిదారులు లబ్ధి పొందే అవకాశం కలిగింది. సొంతింటి కల నెరవేర్చుకోవాలనుకునే అర్హులైన వారందరూ ఈ పొడిగించిన గడువును ఉపయోగించుకుని ఆగస్టు 15లోగా తమ దరఖాస్తులను సమర్పించాలని అధికారులు సూచిస్తున్నారు.

