Cabinet Sub Committee : తెలంగాణ రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టబోతున్న సార్వత్రిక జీవిత బీమా పథకంపై ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ‘ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం’ (IKJBP) అమలుకు సంబంధించిన విధివిధానాలను ఖరారు చేయడం కోసం రేపు (మంగళవారం) కేబినెట్ సబ్ కమిటీ అత్యవసరంగా సమావేశం కానుంది. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అధ్యక్షతన జరగబోయే ఈ కీలక మీటింగ్లో సంబంధిత శాఖల ఉన్నతాధికారులు, అలాగే బీమా రంగానికి చెందిన భాగస్వామ్య సంస్థల (Insurance Companies) ప్రతినిధులు పాల్గొననున్నారు.
తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల చొప్పున సార్వత్రిక జీవిత బీమా ప్రయోజనం కల్పించడమే ఈ ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ పథకాన్ని క్షేత్రస్థాయిలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా అర్హులైన అందరికీ ఎలా వర్తింపజేయాలి, ప్రీమియం చెల్లింపుల బాధ్యతను ప్రభుత్వం ఎలా పంపిణీ చేయాలి అనే అంశాలపై ఈ సమావేశంలో సమగ్రంగా చర్చించనున్నారు. అత్యంత త్వరలోనే ఈ మెగా బీమా స్కీమ్ను రాష్ట్రవ్యాప్తంగా లబ్ధిదారులకు అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ అత్యవసర భేటీని ఏర్పాటు చేసింది.
