ప్రంపచ వ్యాప్తంగా కల్లోలం సృష్టించిన కరోనా మహమ్మారి ఇప్పుడు మరోసారి భారత్లో విజృంభిస్తోంది. మొన్నటి వరకు తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు ఇప్పుడు మళ్లీ పుంజుకుంటున్నాయి. నిన్న 13 వేలకు పైగా కేసులు నమోదు కాగా నేడు.. ఆ సంఖ్య 17 మార్క్ను దాటడం ఆందోళన కలిగించే విషయం. గడిచిన 24గంటల్లో దేశవ్యాప్తంగా 17,336 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 4,33,62,294కు చేరాయి. ఇందులో 4,27,49,056 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు 5,24,954 మంది కరోనాతో మృతి చెందారు. మరో 88,284 కేసులు దేశవ్యాప్తంగా యాక్టివ్గా ఉన్నాయి.
ఒక్కరోజులో 13 మంది మరణించగా, 13,029 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జీ అయ్యారు. కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా మహారాష్ట్రలో 5,218 కేసులు ఉండగా.. కేరళలో 3,890 కేసులు, ఢిల్లీలో 1,934, తమిళనాడులో 1,063, హర్యానాలో 872, కర్ణాటకలో 858 కేసుల చొప్పున నమోదయ్యాయి. కాగా, పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో రోజువారీ పాటివిటీ 4.32 శాతానికి చేరిందని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. అదేవిధంగా యాక్టివ్ కేసులు 0.20 శాతం, రికరీ రేటు 98.59 శాతం, మరణాలు 1.21 శాతంగా ఉన్నాయని పేర్కొంది.