HYDRAA : హైడ్రా బిగ్ అప్‌డేట్.. 140 కొత్త వాహనాలకు గ్రీన్ సిగ్నల్.!

  • రూ.65 కోట్ల టెండర్లపై ఆరోపణలను ఖండించిన హైడ్రా
  • పారదర్శకంగా టెండర్ల ఎంపిక జరిగిందని అధికారుల వివరణ
  • 140 కొత్త వాహనాలు, డీఆర్‌ఎఫ్ పరికరాల కొనుగోలుకు ప్రభుత్వ అనుమతి
  • 2026-27 బడ్జెట్‌తో హైడ్రా విపత్తు నిర్వహణకు మరింత బలం
Hydra

Hydra

HYDRAA : హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (HYDRAA) మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్‌ల టెండర్ల ప్రక్రియపై వస్తున్న ఆరోపణలను తీవ్రంగా ఖండించింది. వర్షాకాల అత్యవసర పనుల టెండర్లలో ఎలాంటి అవకతవకలు జరగలేదని, అంతా పారదర్శకంగా నిర్వహించామని స్పష్టం చేసింది. దీనితో పాటు, హైడ్రా పరిధి విస్తరణ , విపత్తు నిర్వహణ సామర్థ్యాన్ని పెంచేందుకు వీలుగా అదనపు వాహనాలు, అత్యాధునిక పరికరాల కొనుగోలుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

టెండర్ల ఆరోపణల్లో వాస్తవం లేదు: హైడ్రా వివరణ

వర్షాకాల అత్యవసర సేవల కోసం రూ. 65 కోట్ల విలువైన మొత్తం 62 టెండర్లను ఆహ్వానించినట్లు హైడ్రా తెలిపింది. ఇప్పటివరకు 44 టెండర్లను పరిశీలించగా, అందులో 4 టెండర్లు సాంకేతిక కారణాల వల్ల అర్హత సాధించలేదని పేర్కొంది. మిగిలిన 40 టెండర్లలో 18 మంది కాంట్రాక్టర్లు అర్హత సాధించారని వెల్లడించింది. అర్హత సాధించని ఆ 4 టెండర్లకు మళ్లీ నోటిఫికేషన్ జారీ చేశామని, మరో 22 టెండర్ దరఖాస్తుల పరిశీలన ప్రస్తుతం కొనసాగుతోందని హైడ్రా స్పష్టం చేసింది.

×
×
Ad

కేవలం 5 సంస్థలకే టెండర్లు కట్టబెట్టారంటూ వస్తున్న ఆరోపణలు పూర్తిగా బేస్ లెస్ అని ఏజెన్సీ కొట్టిపారేసింది. కాంట్రాక్టర్ల అనుభవం, సన్నద్ధత, అవసరమైన వాహనాలు , సిబ్బంది సామర్థ్యాన్ని ప్రామాణికంగా తీసుకుని, ముగ్గురు సూపరింటెండెంట్ ఇంజినీర్లు , 9 మంది అధికారులతో కూడిన బృందం ఈ ఎంపిక ప్రక్రియను నిర్వహించిందని తెలిపింది. టెండర్లు దక్కని కాంట్రాక్టర్లు ఎవరూ కమిషనర్‌ను కలవలేదని, వర్షాకాల అత్యవసర పనులను పూర్తి జవాబుదారీతనంతో అమలు చేస్తామని ఏజెన్సీ హామీ ఇచ్చింది.

హైడ్రా బలోపేతం.. 140 వాహనాలు, విపత్తు పరికరాల కొనుగోలుకు అనుమతి

హైడ్రా పరిధి విస్తరిస్తున్న నేపథ్యంలో, అత్యవసర సేవలను మరింత వేగవంతం చేయడానికి వీలుగా 140 కొత్త వాహనాలు, డిజాస్టర్ ఎక్విప్‌మెంట్ కొనుగోలుకు రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. ఈ విస్తరణలో భాగంగా డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (DRF) టీమ్స్ సంఖ్య పెరగడంతో అదనపు వనరుల అవసరం ఏర్పడింది. ఇందులో భాగంగా తొలి దశలో 50 శాతం వాహనాలు, పరికరాల కొనుగోలు ఇప్పటికే పూర్తి కాగా, రెండో దశ కొనుగోళ్లకు ప్రభుత్వం ఇప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

ఈ కొత్త కొనుగోళ్లలో భాగంగా 21 డీఆర్‌ఎఫ్ (DRF) ట్రక్కులు, 2 ఇన్నోవా హైక్రాస్ వాహనాలు, 1 ఇన్నోవా క్రిస్టా, 54 మహీంద్రా స్కార్పియో క్లాసిక్/ఎన్ వాహనాలు, 2 ట్రూప్ క్యారియర్ వ్యాన్లు, 2 బస్సులు, , 37 బైక్‌లను కొనుగోలు చేయనున్నారు. వీటితో పాటు రెస్క్యూ ఆపరేషన్ల కోసం 21 అత్యాధునిక డీఆర్‌ఎఫ్ ఎక్విప్‌మెంట్ యూనిట్లను కూడా సేకరించనున్నారు.

2026-27 బడ్జెట్ నుండి నిధులు విడుదల

ఈ కొత్త వాహనాలు , పరికరాల కొనుగోలుకు అయ్యే మొత్తం వ్యయాన్ని 2026-27 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ నుంచి భరించడానికి ప్రభుత్వం అనుమతించింది. ఆర్థిక శాఖ సమ్మతితో రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. జీవో జారీ అయిన నేపథ్యంలో, నిబంధనల ప్రకారం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేసి, అవసరమైన తదుపరి చర్యలు తక్షణమే చేపట్టాలని హైడ్రా కమిషనర్‌ను ప్రభుత్వం ఆదేశించింది.