HYDRAA : నగరంలో వరదల కట్టడి, భూగర్భ జలాల పెంపే లక్ష్యంగా హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (HYDRAA) చెరువుల పునరుద్ధరణకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా రూ. 107 కోట్ల భారీ వ్యయంతో మరో నాలుగు ప్రముఖ చెరువుల అభివృద్ధి పనులను హైడ్రా కమిషనర్ ఎ.వి. రంగనాథ్ అధికారికంగా ప్రారంభించారు. ఇబ్రహీంపట్నంలోని పెద్ద చెరువు, కాముని చెరువుల వద్ద ఆయన స్వయంగా భూమి పూజ చేసి పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.
నాలుగు చెరువులకు సరికొత్త రూపు.. పర్యాటక కేంద్రాలుగా మార్పు
హైడ్రా చేపట్టిన ఈ పునరుద్ధరణ జాబితాలో ఇబ్రహీం పెద్ద చెరువు, భగీరథమ్మ చెరువు, కాముని చెరువు, కాప్రా చెరువులు ఉన్నాయి. మొత్తం 311 ఎకరాల భారీ విస్తీర్ణంలో ఉన్న ఈ నాలుగు చెరువులను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేలా పక్కా ప్రణాళికను సిద్ధం చేశారు. వీటిని కేవలం జలాశయాలుగానే కాకుండా, స్థానికులకు ఆహ్లాదాన్ని పంచే అద్భుతమైన పర్యాటక కేంద్రాలుగా మార్చనున్నారు. ఇందులో భాగంగా చెరువుల చుట్టూ వాకింగ్ ట్రాక్లు (పాత్వేలు), ఓపెన్ జిమ్లు, పిల్లల కోసం ప్రత్యేక ప్లే ఏరియాలను ఏర్పాటు చేయనున్నారు. వీటితో పాటు పెద్ద చెరువుల్లో పర్యాటక శాఖ (Tourism Department) సహకారంతో త్వరలోనే బోటింగ్ వ్యవస్థను కూడా అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.
పూడికతీతపై కమిషనర్ కఠిన ఆదేశాలు.. రెండు విడతల్లో పనులు
చెరువుల పునరుద్ధరణలో భాగంగా నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచేందుకు పూడికను పూర్తిగా తొలగించాలని, నీరు వచ్చే ఇన్లెట్లు, వెళ్లే ఔట్లెట్లను శాస్త్రీయంగా అభివృద్ధి చేయాలని కాంట్రాక్టర్లకు కమిషనర్ రంగనాథ్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. నగరంలో చెరువుల సంరక్షణకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్న హైడ్రా.. ఇప్పటికే మొదటి విడతలో 6 చెరువుల అభివృద్ధిని విజయవంతంగా చేపట్టగా, ఇప్పుడు రెండో విడతలో భాగంగా మొత్తం 14 చెరువులను ఆధునీకరించేందుకు విస్తృతమైన చర్యలు తీసుకుంటోంది.

