Telangana Govt: రాష్ట్రంలోని మున్సిపాలిటీల్లో అభివృద్ధి పనులకు తెలంగాణ ప్రభుత్వం భారీ మొత్తంలో నిధులు మంజూరు చేసింది. రాష్ట్రంలోని 138 మున్సిపాలిటీలకు రూ.2780 కోట్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ కోర్ అర్బన్ సిటీని మినహాయించి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని మున్సిపాలిటీల్లో అభివృద్ధి పనులకు వెంటనే నిధులు విడుదల చేయాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు మున్సిపల్ శాఖ ఈ నిధులు మంజూరు చేసింది. తెలంగాణ రైజింగ్ విజన్ 2027లో భాగంగా గ్రేటర్ హైదరాబాద్ తో పాటు రాష్ట్రమంతటా ఉన్న పట్టణాలను గ్రోత్ హబ్ లుగా తీర్చిదిద్దాలని సీఎం ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. పట్టణాల్లో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా అవసరమైన అభివృద్ధి పనులు చేపట్టాలని అధికారులకు తెలిపారు. అలాగే, ఇప్పటికే ఉన్న మున్సిపాలిటీల విస్తరణతో పాటు కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీలన్నింటా మెరుగైన పౌర సదుపాయాలతో పాటు పెరుగుతున్న డిమాండ్ ను అందుకునేలా అభివృద్ధి పనులు చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు.
Read Also: Peeing on Road: అసలు వీడు మనిషేనా.. కారు డోర్ తీసి ఏంట్రా ఆ పని…
అలాగే, మున్సిపల్ శాఖ ఇచ్చిన ప్రతిపాదనల మేరకు రాష్ట్రంలోని 138 మున్సిపాలిటీల్లో రూ. 2,780 కోట్ల ఖర్చుతో 2,432 పనులు చేపట్టేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆమోదం తెలిపారు. రాష్ట్ర బడ్జెట్ లో పొందుపరిచిన నగరాభివృద్ధి నిధులతో పాటు అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్షర్ డెవెలప్మెంట్ ఫండ్ (UIDF) పథకాల నుంచి ఈ నిధులను మంజూరు చేసినట్లు ప్రకటించారు. కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీలకు రూ.15 కోట్లు, అదనంగా గ్రామ పంచాయతీలు విలీనమైన మున్సిపాలిటీలకు రూ. 20 కోట్లు, పాత మున్సిపాలిటీలకు రూ.15 కోట్ల చొప్పున నిధులు రిలీజ్ చేశారు. కొత్తగా ఏర్పడిన మున్సిపల్ కార్పొరేషన్లకు రూ. 30 కోట్లు మంజూరు చేయగా.. ప్రాధాన్యత క్రమంలో ఈ నిధులను ఖర్చు చేయాలని మున్సిపల్ శాఖ మార్గదర్శకాలను రూపొందించింది. మున్సిపాలిటీల్లో విలీనమైన ప్రాంతాల అభివృద్ధి, అంతర్గత రహదారుల నిర్మాణం, వర్షపు నీరు, మురుగు నీటికి డ్రైన్ల నిర్మాణం, జంక్షన్ల అభివృద్ధి, చెరువులు, కుంటల్లో కాలుష్య నివారణ, డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించిన ప్రాంతాల్లో ప్రాథమిక సదుపాయాల ఏర్పాటు, పార్కుల అభివృద్ధి, కల్వర్టుల నిర్మాణం, షాపింగ్ కాంప్లెక్సుల నిర్మాణ పనులకు ఈ నిధులు ఖర్చు చేయాల్సి ఉంటుంది. అన్ని మున్సిపాలిటీల్లో సంబంధిత విభాగాలు వెంటనే టెండర్లు పిలిచి ఈ పనులు ప్రారంభించాలని తెలిపారు. 2026 మార్చి నాటికి అన్ని పనులను పూర్తి చేయాలని గడువు పెట్టారు.
