NTV Telugu Site icon

Kishan Reddy: మే 5న తెలంగాణకు నితీన్ గడ్కరీ.. పలు జాతీయ రహదారులను జాతికి అంకితం చేస్తాం..

Kishanreddy

Kishanreddy

Kishan Reddy: తెలంగాణ రాష్ట్రంలో వివిధ జాతీయ రహదారుల ప్రాజెక్టులను చాలా చురుకుగా అమలు చేస్తోంది. ఇందులో.. కీలకమైన ఎకనమిక్ కారిడార్లు, ఇతర వ్యూహాత్మక అభివృద్ధికి దోహదపడే కార్యక్రమాలు, పర్యాటకాన్ని ప్రోత్సహించే, అనుసంధానతను పెంచే, రాష్ట్రాభివృద్ధికి బాటలు వేసే వివిధ ప్రాజెక్టులున్నాయి. ఇందులో భాగంగా తెలంగాణలో దాదాపు రూ.6,280 కోట్ల వ్యయంతో నిర్మించిన 285 కిలోమీటర్ల మేర జాతీయ రహదారులను మే 5న కేంద్ర రహదారుల శాఖ మంత్రులు నితిన్ గడ్కరీ, జి.కిషన్ రెడ్డి సంయుక్తంగా జాతికి అంకితం చేయనున్నారు.

Read Also: Royal Enfield Hunter 350 2025: రాయల్ ఎన్ఫీల్డ్ హంటర్ 350 విడుదల.. ధర ఎంతంటే?

ఇక, రోడ్లు, మౌలికవసతుల కల్పన సరిగ్గా జరిగినపుడే అభివృద్ధికి బాటలు పడతాయని నరేంద్ర మోడీ ప్రభుత్వం బలంగా విశ్వసిస్తోందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. దీంట్లో భాగంగానే.. 2014 తర్వాత దేశంలో రహదారుల నిర్మాణ కార్యక్రమం చాలా వేగంగా జరుగుతోంది.. తెలంగాణలోనూ ఈ రంగంలో విశేషమైన పురోగతి కనిపిస్తుందన్నారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి 2014 వరకు తెలంగాణలో 2500 కిలోమీటర్ల పొడవైన జాతీయ రహదారులుంటే.. గత పదేళ్లలోనే మరో 2500 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం జరిగిందన్నారు.

Read Also: Off The Record: మంత్రి వాహనంలో ఎమ్మెల్యే, ఎంపీ తిట్టుకుంటున్నారా..?

అలాగే, హైదరాబాద్ నార్త్‌లో గ్రీన్ ఫీల్డ్ రీజనల్ ఎక్స్‌ప్రెస్ హైవే (రీజనల్ రింగ్ రోడ్ – ఉత్తరభాగం) ప్రాజెక్టుకు సంబంధించి పబ్లిక్-ప్రైవేట్ పార్టనర్‌షిప్ అప్రెయిజల్ కమిటీ (PPPAC), కేబినెట్ అనుమతులు త్వరితగతిన ఇచ్చేలా చర్యలు తీసుకోవాలి.. అలాగే, ఆర్థికపరమైన అంశాలపై త్రైపాక్షిక ఒప్పందాలు చేసుకోవాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కిషన్ రెడ్డి కోరారు. ఇక, హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్డు (సౌత్) నిర్మాణ వ్యయంలో 50 శాతం రాష్ట్ర ప్రభుత్వం భరిస్తే.. ఈ ప్రాజెక్టును జాతీయ రహదారిగా ప్రకటించేందుకు కూడా కేంద్రం సూత్రప్రాయంగా అంగీకరించింది. అలాగే, హైదరాబాద్-శ్రీశైలం మధ్య ప్రయాణ సమయం తగ్గించేందుకు జాతీయ రహదారి-765పై మన్ననూరు నుంచి తెలంగాణ/ఏపీ సరిహద్దు వరకు ప్రతిపాదిత నాలుగు లేన్ల ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి కేంద్ర రోడ్డు రవాణా శాఖ ప్రత్యేక దృష్టి కేంద్రీకరించింది అని కిషన్ రెడ్డి చెప్పుకొచ్చారు.

Read Also: Calcutta High Court: వక్షోజాలను టచ్ చేయడం ‘‘అత్యాచారం కాదు’’, కానీ..

కాగా, ఈ ప్రాజెక్టు టైగర్ రిజర్వ్ ఫారెస్టు మధ్య నుంచి వెళ్తున్నందున దీనికి సంబంధించిన అటవీ శాఖ అనుమతులను వీలైనంత త్వరగా తీసుకుని, డీపీఆర్ పంపించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర రోడ్డు రవాణా శాఖ కోరింది. హైదరాబాద్-కల్వకుర్తి మధ్య ప్రస్తుతం ట్రాఫిక్ ను దృష్టిలో ఉంచుకుని, జాతీయ రహదారి-765ను 4 లేన్లకు విస్తరించేలా ప్రాజెక్టును మంజూరు చేయాలని నితిన్ గడ్కరీని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విన్నవించారు. తెలంగాణలో పలు రోడ్డు, రవాణా ప్రాజెక్టులు భూసేకరణ కారణంగా ఆలస్యం అవుతున్నాయి.. మరో 10 ప్రాజెక్టులు అటవీ శాఖ అనుమతుల జాప్యం కారణంగా పెండింగ్ లో ఉన్నాయి.. వీటిపై రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుంటే త్వరగా చేపట్టేందుకు తాము సిద్ధంగా ఉన్నామని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు.