హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాలలో ఈనెల 29, 30 తేదీల్లో తాగునీటి సరఫరాకు ఆటంకం కలగనుంది. మంజీరా ఫేజ్-2 పైపులైన్లకు మరమ్మతులు నిర్వహిస్తున్న కారణంగా నీటి సరఫరా బంద్ కానుందని జలమండలి ప్రకటించింది. కలగ్గూర్ నుంచి పటాన్ చెరువు వరకు ఉన్న 1500 ఎంఎం డయా పీఎస్పీ పంపింగ్ పైప్లైనుకు సంబంధించి వివిధ ప్రాంతాలలో లీకేజీలను నివారించేందుకు మరమ్మతులు చేపడుతున్నట్లు తెలిపింది. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి శనివారం సాయంత్రం 6 గంటల వరకు అంటే 36 గంటల పాటు నీటి సరఫరా నిలిచిపోనుందని పేర్కొంది.
Read Also: తెలంగాణలో మరో కొత్త పార్టీ
హైదరాబాద్ నగరంలోని డివిజన్ నంబర్ 9 పరిధిలోని హైదర్ నగర్, రాంనరేష్ నగర్, కేపీహెచ్బీ, భాగ్యనగర్, వసంత్ నగర్, ఎస్పీ నగర్… డివిజన్ నంబర్ 15 పరిధిలోని మియాపూర్, దీప్తిశ్రీనగర్, మాతృశ్రీనగర్, లక్ష్మీనగర్, జేపీ నగర్, చందానగర్… డివిజన్ నంబర్ 23 పరిధిలోని నిజాంపేట, బాచుపల్లి, మల్లంపేట, ప్రగతి నగర్.. డివిజన్ నంబర్ 32 పరిధిలోని బొల్లారం సహా పలు ప్రాంతాలలో నీటి సరఫరాకు ఆటంకం కలగనుంది. ప్రజలు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని జలమండలి అధికారులు విజ్ఞప్తి చేశారు.