NTV Telugu Site icon

CM Revanth Reddy: ఒక బలమైన వ్యవస్థగా హైడ్రా ఉండాలి.. సీఎం రేవంత్ ఆదేశాలు జారీ

Cm Revanth Reddy

Cm Revanth Reddy

CM Revanth Reddy: సచివాలయంలో హైడ్రా (హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్)పై అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఇతర అధికారులు పాల్గొన్నారు. హైడ్రా విధివిధానాలపై చర్చిస్తున్నారు. గ్రేటర్‌ హైదరాబాద్‌లో కీలకమైన సేవలను అందించేందుకు హైడ్రా ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సిటీ విస్తరణకు అనుగుణంగా భవిష్యత్ అవసరాలను అంచనా వేసుకొని ప్రజలకు విస్తృత సేవలు అందించేలా కొత్త వ్యవస్థను రూపొందించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, వాటర్‌ బోర్డు, విజిలెన్స్, ట్రాఫిక్‌, పోలీస్ విభాగాలన్నింటి మధ్య సమన్వయం ఉండేలా హైడ్రాను రూపకల్పన చేయాలనేది సీఎం ఆలోచన. వర్షాకాలంలో విపత్తులు సంభవించే అవకాశం ఉన్నందున ఈ వ్యవస్థను బలోపేతం చేయాలని సీఎం భావిస్తున్నట్లు తెలుస్తోంది.

Read Also: Raghunandan Rao: పంచాయతీల కాల పరిమితి ముగిసింది.. వెంటనే ఎన్నికలు జరపాలి..

హైడ్రా విధివిధానాలపై అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు సూచనలు చేశారు. ఔటర్ రింగ్ రోడ్డు వరకు 2వేల చదరపు కి.మీ పరిధిలో హైడ్రా విధులు నిర్వహించేలా ఉండాలని సీఎం అధికారులకు వెల్లడించారు. ఇప్పటి వరకు జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న అనధికారిక హోర్డింగ్స్, ఫ్లెక్సీలు తొలగింపు, అపరాధ రుసుము వసూలు బాధ్యత హైడ్రాకు బదలాయించాలన్నారు. జోన్ల విభజనలో పోలీస్ స్టేషన్ పరిధులు, అసెంబ్లీ నియోజకవర్గ పరిధులు పూర్తిగా ఒకే జోన్ లో వచ్చేలా జాగ్రత్త వహించాలన్నారు. నాళాలు, చెరువులు, ప్రభుత్వ స్థలాల ఆక్రమణల విషయంలో నిబంధనలు కఠినతరం చేసేలా అధ్యయనం చేయాలని అధికారులను ఆదేశించారు. హెచ్ఎండీఏ, వాటర్ వర్క్స్, డిజాస్టర్ మేనేజ్మెంట్, మున్సిపల్ విభాగాల మధ్య ఎప్పటికప్పుడు సమన్వయం ఉండేలా చూడాలన్నారు. ఒక బలమైన వ్యవస్థగా హైడ్రా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. అవసరమైతే ప్రత్యేక నిధులు కేటాయించే అంశాన్ని పరిశీలించాలని సూచించారు. అసెంబ్లీ సమావేశాల్లోగా పూర్తిస్థాయి విధివిధానాలు రూపొందించాలని సీఎం రేవంత్ అధికారులకు స్పష్టం చేశారు.