Hyderabad Traffic Alert: ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం (మే 10) హైదరాబాద్లో పర్యటించనున్నారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో నిర్వహించే భారీ బహిరంగ సభకు ప్రధాని హాజరవుతున్న నేపథ్యంలో.. నగరంలో వీవీఐపీ (VVIP) కదలికల దృష్ట్యా పోలీసులు భారీ ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ముఖ్యంగా ఆదివారం మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు పలు ప్రధాన మార్గాల్లో ట్రాఫిక్ మళ్లింపులు, తాత్కాలిక నిలిపివేతలు అమలులో ఉంటాయని జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ట్రాఫిక్) ఒక ప్రకటనలో వెల్లడించారు.
మధ్యాహ్నం 1 గంట నుంచి రాత్రి 8 గంటల వరకు ..
ప్రధాని ప్రయాణించే మార్గాల్లో సాధారణ ప్రజలు ప్రయాణించవద్దని పోలీసులు సూచించారు. బేగంపేట ఎయిర్పోర్ట్ – గ్రీన్ల్యాండ్స్ – పంజాగుట్ట, నాగార్జున సర్కిల్ – NFCL జంక్షన్ – SNT జంక్షన్ – సాగర్ సొసైటీ, NTR భవన్ – జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ – పెద్దమ్మ తల్లి ఖమాన్, రోడ్ నెం. 36/31 – నీరూస్ జంక్షన్ – సైబర్ టవర్స్ జంక్షన్, శిల్పారామం – హైటెక్స్ ఖమాన్ – NAC మెయిన్ గేట్ – కాసాని గేట్ – HICC ప్రాంతాల్లో మధ్యాహ్నం 1 గంట నుంచి రాత్రి 8 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయన్నారు. సికింద్రాబాద్ పరిసరాల్లో మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 10 వరకు ఆంక్షలు ఉంటాయని చెప్పారు. సభ దృష్ట్యా సికింద్రాబాద్ ప్రాంతంలో రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో M.G. రోడ్, R.P. రోడ్, S.D. రోడ్ల వైపు వెళ్లకపోవడమే మంచిదని సూచించారు.
ప్రయాణీకులకు ముఖ్య సూచనలు..
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు వెళ్లాల్సిన ప్రయాణీకులు ట్రాఫిక్ ఆంక్షల దృష్ట్యా వారి వారి ఇళ్ల నుంచి చాలా ముందుగా బయలుదేరాలని పోలీసులు కోరారు. రోడ్డు మార్గాల్లో రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో, సాధ్యమైనంత వరకు మెట్రో రైలు సేవలను వినియోగించుకోవాలని సూచించారు. నగరంలో ట్రాఫిక్ సమాచారం కోసం హైదరాబాద్ ట్రాఫిక్ హెల్ప్లైన్ 9010203626 కు కాల్ చేయవచ్చని చెప్పారు. అలాగే ప్రయాణంలో ఏదైనా అసౌకర్యం కలిగితే సోషల్ మీడియా వేదికల (ట్విట్టర్:https://twitter.com/HYDTP, ఫేస్బుక్: https://facebook.com/HYDTP/) ద్వారా ఫిర్యాదు చేయవచ్చని సూచించారు. ప్రధాని పర్యటన ప్రశాంతంగా జరిగేందుకు, ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు నగర పౌరులు ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలని జాయింట్ కమిషనర్ కోరారు.
