గత కొన్ని రోజులుగా ఎండలతో అల్లాడుతున్న భాగ్యనగరవాసులకు వరుణుడు ఊరటనిచ్చాడు. సోమవారం మధ్యాహ్నం వరకు భానుడు తన ప్రతాపం చూపినప్పటికీ, మధ్యాహ్నం తర్వాత ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఆకాశం మబ్బుపట్టి చల్లని గాలులు వీచడంతో నగరంలో ఆహ్లాదకరమైన పరిస్థితులు నెలకొన్నాయి. చాలా రోజుల తర్వాత కురిసిన చిరు జల్లులు భాగ్యనగరాన్ని మురిపించాయి. ముఖ్యంగా అబిడ్స్, బషీర్ బాగ్, సైఫాబాద్, ట్యాంక్ బండ్, సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో తేలికపాటి వర్షం కురిసింది. అలాగే మీర్ పేట్, బడంగ్ పేట్ ప్రాంతాల్లోనూ వాన పడింది. ఎల్బీ నగర్, మలక్ పేట్, సరూర్ నగర్, చార్మినార్, బీఎన్ రెడ్డి, ఉప్పల్, నాగోల్, అంబర్ పేట్, వనస్థలిపురం, హయత్ నగర్ వంటి ప్రాంతాల్లో ఈదురు గాలులు బలంగా వీచాయి.
Anil Ambani: అంబానీకి షాక్ ఇచ్చిన బాంబే హైకోర్టు..
వికారాబాద్ ప్రాంతంలో వీస్తున్న భారీ ఈదురు గాలులు ప్రస్తుతం హైదరాబాద్ దిశగా వేగంగా కదులుతున్నాయి. ఈ ప్రభావంతో సాయంత్రం 6 గంటల తర్వాత గచ్చిబౌలి, రాజేంద్ర నగర్, లింగంపల్లి పరిసర ప్రాంతాల్లో బలమైన గాలులతో కూడిన చిరు జల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. నగరంలో వాతావరణం చల్లబడితే, జిల్లాల్లో మాత్రం ఈదురు గాలులు బీభత్సం సృష్టించాయి.. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం కాళేశ్వరంలో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం పడింది. గాలుల ధాటికి పలుచోట్ల చెట్లు విరిగిపడటంతో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సిద్దిపేట జిల్లాలోని దుబ్బాకలో ఉరుములు, మెరుపులతో కూడిన వడగండ్ల వాన (రాళ్ల వర్షం) కురిసింది. భారీ గాలుల కారణంగా షాపుల బోర్డులు, ఫ్లెక్సీలు ఎగిరిపోయాయి. కొన్ని రేకుల ఇళ్లు పాక్షికంగా ధ్వంసమయ్యాయి. రోడ్లన్నీ జలమయం కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
