Anil Ambani: రిలయన్స్ గ్రూప్ అధినేత అనిల్ అంబానీకి బాంబే హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గతంలో ఆయనకు అనుకూలంగా ఉన్న మధ్యంతర ఉపశమనాన్ని తాజాగా కోర్టు రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. అసలు వివాదం ఏంటంటే.. అనిల్ అంబానీకి చెందిన కంపెనీల వ్యవహారాల్లో నిధుల దుర్వినియోగం జరిగినట్లు ఆరోపణలు రావడంతో, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, ఐడిబిఐ బ్యాంకులు ఆయన ఖాతాలను ‘మోసపూరితమైనవి’ గా ప్రకటించే ప్రక్రియను ప్రారంభించాయి. ఈ ప్రక్రియను సవాలు చేస్తూ అనిల్ అంబానీ గతంలో కోర్టును ఆశ్రయించారు.
కోర్టులో ఏం జరిగిందంటే..
2025 డిసెంబర్లో ఒక సింగిల్ జడ్జి అనిల్ అంబానీకి ఉపశమనం కల్పించారు. నిధుల దుర్వినియోగాన్ని తేల్చిన ‘ఫోరెన్సిక్ ఆడిట్ రిపోర్ట్’ తయారు చేసిన వ్యక్తి అర్హత కలిగిన చార్టర్డ్ అకౌంటెంట్ కాదని, అందుకే బ్యాంకులు చర్యలు తీసుకోకూడదని స్టే విధించారు. అయితే ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ బ్యాంకులు డివిజన్ బెంచ్ (ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనం)ను ఆశ్రయించాయి. ఆడిట్ నివేదిక సరైనదేనని, నిధుల మళ్లింపు ఆరోపణలు వాస్తవమని బ్యాంకులు వాదించాయి. బ్యాంకుల వాదనతో ఏకీభవించిన డివిజన్ బెంచ్, గతంలో ఇచ్చిన స్టే ఆర్డర్ను కొట్టివేసింది. సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పు చట్టబద్ధంగా సరికాదని స్పష్టం చేసింది. ఈ తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్లే వరకు సమయం ఇవ్వాలని, స్టే విధించాలని అనిల్ అంబానీ కోరినప్పటికీ హైకోర్టు అందుకు నిరాకరించింది. ఫలితంగా, అనిల్ అంబానీ ఖాతాలను ‘ఫ్రాడ్’గా ప్రకటించి, తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి బ్యాంకులకు ఇప్పుడు మార్గం సుగమం అయ్యింది. ఈ తీర్పుతో అనిల్ అంబానీ బ్యాంకింగ్ లావాదేవీల విషయంలో మరిన్ని కఠిన చర్యలు ఎదుర్కోవాల్సి వచ్చే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు.