గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ప్రజలకు వాతావరణ శాఖ కీలక హెచ్చరిక జారీ చేసింది. రానున్న రెండు నుంచి మూడు గంటల్లో జీహెచ్ఎంసీ (GHMC) పరిధిలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఈదురుగాలులతో కూడిన ఉరుముల వర్షం కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. వర్షంతో పాటు గంటకు దాదాపు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని, ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
ఆకస్మిక వర్షాల వల్ల నగరంలో పలుచోట్ల రోడ్లపై నీరు నిలిచిపోవడం, చెట్ల కొమ్మలు విరిగిపడటం వంటి ఘటనలు జరిగే ప్రమాదం ఉంది. సాయంత్రం వేళ ఆఫీసులు, పనుల నుంచి ఇళ్లకు తిరిగి వెళ్లే ప్రయాణికులు , వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరారు. అత్యవసర పరిస్థితి ఉంటే తప్ప ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని, వర్షం కురిసే సమయంలో చెట్లు, కరెంట్ స్తంభాలు , పాత భవనాల కింద నిలబడకూడదని హెచ్చరించారు.

