హైదరాబాద్ ఐటీ కారిడార్కు అత్యంత చేరువలో ఉన్న ఖానామెట్ ప్రాంతంలో ప్రభుత్వ భూములపై హైడ్రా (HYDRAA) మరోసారి ఉక్కుపాదం మోపింది. ఖానామెట్ సర్వే నంబర్ 55లో కొన్ని నిర్మాణ సంస్థలు అక్రమంగా ఆక్రమించుకున్న సుమారు 8 ఎకరాలకు పైగా భూమిని అధికారులు భారీ ఆపరేషన్ ద్వారా స్వాధీనం చేసుకున్నారు. బహిరంగ మార్కెట్లో ఈ భూమి విలువ సుమారు 1200 కోట్ల రూపాయలకు పైగా ఉంటుందని హైడ్రా ప్రాథమికంగా అంచనా వేసింది. గత కొంతకాలంగా ఈ విలువైన ప్రభుత్వ భూమిపై కొన్ని రియల్ ఎస్టేట్ , నిర్మాణ సంస్థలు ఆధిపత్యం చెలాయిస్తూ, అక్కడ తాత్కాలిక షెడ్లు , ఆర్సీసీ ప్లాంట్లను ఏర్పాటు చేశాయి. పక్కా సమాచారం, ఫిర్యాదుల ఆధారంగా రంగంలోకి దిగిన హైడ్రా బృందం, పోలీసుల భారీ బందోబస్తు మధ్య ఈ ఆక్రమణలను నేలమట్టం చేసింది.
ఈ ఆపరేషన్ సందర్భంగా అక్కడున్న కార్మికుల షెడ్లను తొలగించడమే కాకుండా, సదరు నిర్మాణ సంస్థ చేతే ఆర్సీసీ ప్లాంట్ను స్వయంగా తొలగింపజేశారు. వాస్తవానికి ఈ భూమి అసైన్డ్ ల్యాండ్గా గుర్తించబడిందని, ఇది ఇప్పటికే ప్రభుత్వ నిషేధిత జాబితాలో (Prohibited List) ఉందని అధికారులు స్పష్టం చేశారు. ఆక్రమణలను తొలగించిన వెంటనే ఆ 8 ఎకరాల భూమి చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేసి, అది ప్రభుత్వ భూమి అని తెలియజేస్తూ హెచ్చరిక బోర్డులను నాటారు. గతంలో కూడా ఇదే ప్రాంతంలో ఆక్రమణలను తొలగించినప్పటికీ, మళ్లీ తప్పుడు క్లెయిమ్లతో నిర్మాణ సంస్థలు చొరబడటంతో ఈసారి హైడ్రా మరింత కఠినంగా వ్యవహరించింది. ప్రభుత్వ ఆస్తులను కాపాడే విషయంలో ఎంతటి వారినైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదని, రియల్ ఎస్టేట్ సంస్థల తప్పుడు వాదనలపై కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా అధికారులు హెచ్చరించారు.
