తెలంగాణలో బోనాల పండుగ ఉత్సవాలు ప్రారంభం అయ్యాయి.. గోల్కొండలో ప్రారంభమైన బోనాలు ఇప్పుడు లష్కర్కు చేరుకున్నాయి.. రేపు అనగా ఆదివారం రోజు లష్కర్ బోనాలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.. కరోనా మహమ్మారి తర్వాత బోనాలు జరుగుతుండడం.. ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చే అవకాశం ఉండడంతో పాటు.. వీఐపీల తాకిడి కూడా ఉండనున్న నేపథ్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు పోలీసులు.. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయం చుట్టూ బారికేడ్లు ఏర్పాటు చేశారు.. ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.. బందోబస్తులో 2,500 మందికి పైగా పోలీసులు ఉండనుండగా.. 280 సీసీటీవీ కెమెరాలతో నిఘా పెట్టారు. ఈసారి సీఎం కేసీఆర్ సహా మంత్రులు, వీఐపీలు వచ్చే అవకాశాలు ఉండడంతో సాధారణ భక్తులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు.. మహిళా భక్తులకు ఇబ్బంది లేకుండా.. వారి భద్రతను దృష్టిలో ఉంచుకుని షీ టీమ్స్, మఫ్టీ పోలీసులను రంగంలోకి దింపనున్నారు.. బోనంతో వచ్చే మహిళలకు, సాధారణ భక్తులకు ప్రత్యేక క్యూ లైన్లను ఏర్పాటు చేశారు. క్యూ లైన్లను పూర్తిగా సీసీటీవీ కెమెరాల నిఘా నీడలోకి తెచ్చారు. అవి మహంకాళి పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ సెంటర్ కెమెరాలను కనెక్ట్ చేశారు.
మరోవైపు, భక్తుల తాకిడి, పార్కింగ్ ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.. టెంపుల్ కి వచ్చే భక్తుల వాహనాల కోసం స్పెషల్ పార్కింగ్ ఏర్పాట్లు చేస్తున్నారు. ఆదివారం తెల్లవారుజామున 4 గంటల నుంచి సోమవారం బోనాల జాతర ముగిసేవరకు ట్రాఫిక్ డైవర్షన్స్ ఉంటాయని.. ఆలయానికి 2 కిలోమీటర్ల దూరం నుంచే ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్టు పోలీసులు చెబుతున్నారు. ట్రాఫిక్ ఆంక్షలను పరిశీలిస్తే.. కర్బలా మైదాన్ నుంచి సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ వెళ్లే వెహికల్స్ ను రాణిగంజ్ క్రాస్ రోడ్స్, మినిస్టర్ రోడ్స్, రసూల్ పురా క్రాస్ రోడ్స్, పీఎస్ టీ ఫ్లై ఓవర్, హెచ్ పీఎస్ యూటర్న్, సీటీవో, ఎస్ బీఐ క్రాస్ రోడ్స్, వైఎంసీఏ క్రాస్ రోడ్స్, సెయింట్ జాన్స్ రోటరీ, సంగీత్, గోపాలపురం లేన్ మీదుగా దారి మళ్లిస్తారు.. ఇక, రైల్వేస్టేషన్ నుంచి ట్యాంక్ బండ్ వైపు వెహికల్స్ చిలకలగూడ క్రాస్ రోడ్స్, గాంధీ ఆస్పత్రి, ముషీరాబాద్ క్రాస్ రోడ్స్, కవాడిగూడ, మ్యారియట్ హోటల్ మీదుగా వెళ్లాలి.. బైబిల్ హౌస్ నుంచి రైల్వేస్టేషన్, తిరుమలగిరి వైపు వచ్చే వాహనాలను ఘస్మండి క్రాస్ రోడ్స్, సజ్జన్లాల్ స్ట్రీట్, హిల్ స్ట్రీట్ రాణిగంజ్ వైపు దారి మళ్లించనున్నట్టు ప్రకటించారు. మరోవైపు, ఎస్బీఐ క్రాస్ రోడ్స్ నుంచి ట్యాంక్బండ్ వైపు వెళ్లే వాహనాలు ప్యారడైజ్, మినిస్టర్ రోడ్, క్లాక్ టవర్, సంగీత్ క్రాస్ రోడ్స్, చిలకలగూడ, ముషీరాబాద్ క్రాస్ రోడ్స్, కవాడిగూడ, ట్యాంక్ బండ్ రూట్లో దారి మళ్లించనున్నారు… ఇక, సీటీవో జంక్షన్ నుంచి ఎంజీ రోడ్ వైపు వచ్చే వెహికల్స్ ప్యారడైజ్ క్రాస్ రోడ్స్, సింథి కాలనీ, మినిస్టర్ రోడ్స్, రాణిగంజ్ క్రాస్ రోడ్స్, కర్బాల మైదాన్ రూట్ లో వెళ్లాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.
ఇక, అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తుల కోసం ప్రత్యేకంగా పార్కింగ్ ప్రాంతాలను ఎంపిక చేశారు పోలీసులు.. ఇప్పటికే సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో ఏర్పాట్లను పరిశీలించిన హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్.. ట్రాఫిక్ ఆంక్షలు, పార్కింగ్ పాయింట్లపై అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.. దీంతో.. సెయింట్ జాన్స్, రోటరీ, స్వీకార్ ఉపకార్, ఎస్బీహెచ్ వైప నుంచి వచ్చే వెహికల్స్ హరిహర కళా భవన్, మహబూబియా ఎస్ఐటీ కాలేజీ వద్ద పార్క్ చేయాల్సి ఉంటుందని.. సుభాష్ రోడ్ వైపు నుంచి వచ్చే వెహికల్స్ ఓల్డ్ జైల్ ఖాన్ ఓపెన్ ప్లేస్ లో పార్కింగ్ చేయాలని.. కర్బాలా మైదాన్, బైబిల్ హౌస్ వైపు నుంచి వచ్చే వెహికల్స్ ఇస్లామియా హై స్కూల్ గ్రౌండ్ లో పార్కింగ్ చేసుకోవాలని.. రాణిగంజ్, అడయ్య క్రాస్ రోడ్ నుంచి వచ్చే వెహికల్స్ అడయ్య మెమోరియల్ హైస్కూల్ గ్రౌండ్ లో పార్క్ చేయాలని.. రసూల్ పురా, సీటీవో, బాలంరాయి నుంచి వెహికల్స్ మహాత్మ గాంధీ రోడ్, గాంధీ విగ్రహం దగ్గర పార్క్ చేసుకోవాలని.. మంజు థియేటర్స్ నుంచి వచ్చే వెహికల్స్ అంజలి థియేటర్ లేస్ లో పార్కింగ్ చేయాలని సూచించారు పోలీసులు.