వేసవి ప్రారంభానికి ముందే తెలంగాణలో విద్యుత్ డిమాండ్ పెరిగింది. వినియోగంలో ఆల్టైమ్ రికార్డు త్వరలో నమోదుకానుందని విద్యుత్ వర్గాలు చెబుతున్నాయి. దింతో కరెంట్ సరఫరాలో ఇబ్బందులు తలెత్తకుండా కసరత్తు మొదలుపెట్టారు.
తెలంగాణలో కరెంటు డిమాండ్ ఆల్ టైమ్ రికార్డుకు దగ్గర్లో ఉంది. గత ఏడాది మార్చి చివర్లో 13 వేల 688 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ ను అధిగమించింది. అయితే గతేడాది మార్చి 4న అత్యధికంగా నమోదైన విద్యుత్ డిమాండ్.. ఈ ఏడు ఇప్పటికే అధికమించింది. ఈనెలాఖరులోగా 14 వేల మెగావాట్ల విద్యుత్ వినియోగం దాటే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
గతేడాది ఫిబ్రవరి 28న 13 వేల 252 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ నమోదైంది. ఇక ఉమ్మడి ఎపిలో 2014 మార్చి 23న అత్యధికంగా 13వేల 162 మెగావాట్ల కరెంటును వాడగా ప్రస్తుతం తెలంగాణలో అంతకుమించి విద్యుత్ డిమాండ్ పెరిగింది. అప్పటితో పోలిస్తే కరెంటు కనెక్షన్లు కూడా పెరిగాయి.
దీంతో ఎండాకాలం ప్రారంభం కాకముందే రాష్ట్రంలో కరెంట్ డిమాండ్ పెరుగుతోందని అధికారులు అంటున్నారు. రానున్న రోజుల్లో మరో 50 లక్షలకనెక్షన్లు పెరిగే అవకాశం ఉందన్నది వారి మాట. ఇటు ఉక్కపోత కూడా ప్రారంభం కానుండడంతో కొన్ని రోజుల్లోనే కరెంటు వినియోగం 14 వేల మెగావాట్లు దాటే అవకాశం ఉందని లెక్క కడుతున్నారు.
పెరుగుతున్న విద్యుత్ వినియోగానికి అనుగుణంగా పంపిణీ వ్యవస్థను మరింత పటిష్టపరిచేందుకు విద్యుత్ శాఖ ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. అలాగే విద్యుత్ నష్టాలను తగ్గించడం కోసం నాణ్యత కలిగిన మీటర్ల ఏర్పాటు, అధిక సామర్ధ్యం ఉన్న కండక్టర్లు మార్చడం వంటివి చేయాలన్న ఆలోచనలో ఉన్నారు. ఏడాదికి వెయ్యి యూనిట్లకు పైగా తలసరి విద్యుత్ వినియోగం జరిగే రాష్ట్రాల్లో తెలంగాణ అత్యధికంగా 10 శాతం వృద్ధిరేటు సాధించి ప్రథమ స్థానంలో నిలిచింది. తెలంగాణ వచ్చిన నాటి పరిస్థితితో పోల్చుకుంటే ప్రస్తుతం డిమాండ్ 142.6 శాతం అధికమని అంటున్నారు అధికారులు. ముందు ముందు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నట్టు చెబుతున్నారు.