తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి కనీస ముందుచూపు లేకపోవడం వల్లే రాష్ట్రం అంధకారంలోకి వెళ్తోందని మండిపడ్డారు. “ఒకప్పుడు కరెంట్ పోతే వార్త.. కానీ ఈ చేతకాని ప్రభుత్వ పాలనలో ఇప్పుడు కరెంట్ ఉంటేనే వార్తగా మారింది” అని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో విద్యుత్ సరఫరా సరిగ్గా లేకపోవడంతో ఇప్పటికే 11 జిల్లాల్లో భారీ ఎత్తున ధర్నాలు జరిగాయని, చాలా చోట్ల రైతులు ఆగ్రహంతో సబ్స్టేషన్లను ముట్టడిస్తున్నారని గుర్తుచేశారు. అప్రకటిత కరెంట్ కోతలతో రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు నరకం చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
బొగ్గు కొరత, విచ్చలవిడి స్కామ్లు!
రాష్ట్రంలోని థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో కనీసం 6 నుంచి 7 రోజులకు సరిపడా బొగ్గు నిల్వలు కూడా లేకపోవడం వల్లే ఈ తీవ్రమైన విద్యుత్ సమస్య తలెత్తిందని హరీష్ రావు ఆరోపించారు. ప్రభుత్వ నిర్లక్ష్యం, కనీస నిర్వహణ లోపం వల్ల బొగ్గు నిల్వలు లేక విద్యుత్ ఉత్పత్తి పూర్తిగా కుంటుపడిందని స్పష్టం చేశారు. “ఈ ప్రభుత్వంలో బొగ్గు లో స్కాం, పవర్ లో స్కాం, సాండ్ (ఇసుక) లో స్కామ్లు విచ్చలవిడిగా బయటపడుతున్నాయి” అని దుయ్యబట్టారు. ప్రస్తుతం రాష్ట్రంలోని ప్రధాన రిజర్వాయర్లలో కేవలం 33 శాతం మాత్రమే నీటి నిల్వలు ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతిపక్షంగా తాము నిరంతరం ప్రభుత్వాన్ని నిద్రలేపుతున్నా, పాలకుల్లో కనీస ఉలుకూ పలుకూ లేదని ధ్వజమెత్తారు.
7,180 మెగావాట్ల సామర్థ్యం ఉన్నా.. ఉత్పత్తి సగమే
తెలంగాణ రాష్ట్రంలో సరిపడా విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం ఉందని హరీష్ రావు గణాంకాలతో సహా వివరించారు. రాష్ట్రంలో 7,180 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసే అవకాశం ఉన్నప్పటికీ, ఈ ప్రభుత్వ చేతకానితనం వల్ల కేవలం 3,190 మెగావాట్లు మాత్రమే ఉత్పత్తి చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం నడిపే వారికి కనీస అవగాహన, సోయి లేదని.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, ఇంధన శాఖను పర్యవేక్షిస్తున్న ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు కనీస బాధ్యత లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్నదాతలకు కనీసం 8 గంటల విద్యుత్ను కూడా అందించలేకపోతున్నారని విమర్శించారు.

