Harish Rao : రూ.500 కోట్ల భూమి రూ.87 కోట్లకేనా.?రేవంత్‌కు హరీశ్ రావు లేఖ..!

  • రూ.500 కోట్ల భూమి రూ.87 కోట్లకేనా?
  • ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టే కుట్ర?
  • సుప్రీంకోర్టు తీర్పును పట్టించుకోలేదా?
  • నిర్ణయం వెనక్కి తీసుకోకపోతే పోరాటం!
Harish Rao

Harish Rao

నగరం నడిబొడ్డున ఉన్న అత్యంత విలువైన ప్రభుత్వ భూములను ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం రియల్ ఎస్టేట్ ఏజెన్సీగా మారిపోయిందని బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శించారు. తెలంగాణ సమాజ సంక్షేమాన్ని గాలికి వదిలేసిన రేవంత్ రెడ్డి సర్కార్.. కమీషన్ల కోసం వేల కోట్ల రూపాయల విలువైన ఆస్తులను కారుచౌకగా పంపిణీ చేస్తోందని ఆరోపించారు. ఈ మేరకు ఆజామాబాద్ భూముల కేటాయింపు అవకతవకలపై ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఒక సుదీర్ఘ బహిరంగ లేఖ రాశారు.

రూ.500 కోట్ల భూమి.. రూ.87 కోట్లకే ప్రైవేటు పరం

హైదరాబాద్‌ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సమీపంలోని అజామాబాద్‌లో ఉన్న ఆయిల్‌ఫెడ్ సంస్థకు చెందిన 3 ఎకరాల 23 గుంటల (15,984 గజాలు) భూమిని ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టే భారీ కుట్ర జరుగుతోందని లేఖలో పేర్కొన్నారు. ఓపెన్ మార్కెట్‌లో దాదాపు రూ.500 కోట్ల దాకా విలువ చేసే ఈ భూమిని కేవలం రూ.87 కోట్లకే ఒక ప్రైవేట్ వ్యక్తికి అప్పగించేందుకు సిద్ధమయ్యారని మండిపడ్డారు. ఆ రూ.87 కోట్లు చెల్లించడానికి ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఆయిల్‌ఫెడ్‌ సిద్ధంగా ఉన్నప్పటికీ, దానిని పక్కనబెట్టి ప్రైవేట్ వ్యక్తికి కట్టబెట్టడం వెనుక ఉన్న అసలు కుంభకోణం ఏంటో ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

అత్యున్నత న్యాయస్థానం తీర్పును తుంగలో తొక్కిన సర్కార్

గతంలో 1987లో సుప్రీంకోర్టు కూడా ప్రైవేట్ సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసి, ఆ భూమిపై పూర్తి హక్కు ప్రభుత్వానిదేనని స్పష్టం చేసిందని హరీశ్ రావు గుర్తుచేశారు. తమ పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఎలాంటి ప్రైవేటు శక్తులకు తలొగ్గకుండా వందల కోట్ల విలువైన ఈ ప్రభుత్వ ఆస్తిని చిత్తశుద్ధితో కాపాడామని తెలిపారు. ఒకవైపు సామాన్యుల ఇళ్లను 22A జాబితాలో పెట్టి వేధిస్తున్న కాంగ్రెస్ నాయకులు, మరోవైపు కోకాపేట, రాయదుర్గం, గచ్చిబౌలి , అజామాబాద్‌లలో ఖరీదైన ప్రభుత్వ భూములను కమీషన్ల కోసం పల్లీలు, బఠానీల్లా దారాదత్తం చేస్తున్నారని ధ్వజమెత్తారు.

నిర్ణయం ఉపసంహరించుకోకపోతే మహా పోరాటం

స్వార్థ ప్రయోజనాల కోసం ప్రభుత్వం ఇలాగే ఆస్తులను అమ్ముకుంటూ పోతే భవిష్యత్తులో బడికి, గుడికి, చివరికి స్మశానానికి కూడా స్థలం మిగలదని హెచ్చరించారు. ప్రభుత్వం తక్షణమే ఈ అక్రమ కేటాయింపును రద్దు చేసి, ఆ భూమికి సంబంధించిన పూర్తి ఫ్రీహోల్డ్ హక్కులను ఆయిల్‌ఫెడ్‌కే కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రజల సొత్తును ప్రైవేటు వ్యక్తులకు దోచిపెడితే బీఆర్ఎస్ చూస్తూ ఊరుకోదని, ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు న్యాయపోరాటంతో పాటు ప్రజా క్షేత్రంలోనూ మహా పోరాటం చేస్తామని తేల్చిచెప్పారు.