బేగంపేట్ లోని సెంటర్ ఫర్ ఎకనామిక్స్ అండ్ సోషల్ స్టడీస్ (సెస్)లో విద్యార్థినుల వసతి గృహానికి ఆర్థిక, అరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు శంకుస్ధాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమగ్రమైన ఆర్థిక, సామాజిక అధ్యయనం ఉన్నప్పుడే ఏ రాష్ట్రం అయినా, దేశం అయినా పురోగతి చెందుతుందని ఆయన అన్నారు. ఆ ఫలితాల ఆధారంగా మంచి పరిపాలన అందించడం సాధ్యం అవుతుందని, రాబోయే రోజుల్లో బడ్జెట్ అంశాలకు సంబంధించి సెస్ తో మరింతగా కలిసి తో పని చేద్దామని ఆయన అన్నారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత ప్రభుత్వం సెస్ ను ఎంతగానో ప్రోత్సహిస్తున్నదని ఆయన వెల్లడించారు.
రాష్ట్ర ఆర్థిక, సామాజిక స్థితిగతుల మీద అధ్యయనాలు చేస్తూ సెస్ ఎప్పటికపుడు విలువైన సూచనలు చేస్తున్నదని, జాతీయ స్థాయిలో ఇక్కడి పీహెచ్డీ కోర్సుకు డిమాండ్ ఉందని ఆయన అన్నారు. వివిధ రాష్ట్రాల నుండి చేరుతున్నారని, వీరి అవసరాల నిమిత్తం రూ.5 కోట్లతో బాలికల వసతి గృహం ఏర్పాటు చేసుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు వినోద్ కుమార్, సెస్ ఫౌండర్ మెంబర్లు మహేందర్ రెడ్డి, జి ఆర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.