Harish Rao : రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి , డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కలపై బీఆర్ఎస్ (BRS) సీనియర్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా ప్రజలకు, రైతులకు నమ్మకద్రోహం చేశారని మండిపడ్డారు. హామీలు 100 రోజుల్లో నెరవేర్చకపోతే నిలదీయమన్న భట్టి విక్రమార్క మాటలను గుర్తు చేస్తూ.. “మరి ఇప్పుడు రండి, మిమ్మల్ని నిలదీస్తాం” అని హరీష్ రావు సవాల్ విసిరారు. సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో చేసిన వ్యాఖ్యలు, ఇచ్చిన హామీలు , వాటిపై ఆయన ఎన్నిసార్లు మాట తప్పారో చూపే ప్రత్యేక వీడియోలను స్క్రీన్పై ప్లే చేస్తూ హరీష్ రావు కాంగ్రెస్ తీరును ఎండగట్టారు.
రైతుబంధు ఎగ్గొట్టారు.. కేసీఆర్ పాలనే శ్రీరామరక్ష..
తంలో కేసీఆర్ ప్రభుత్వం రెండు పంటలకు రూ. 10 వేలు చొప్పున రైతుబంధు ఇస్తుంటే, తాము అధికారంలోకి వస్తే మూడు పంటలకు రూ. 15 వేలు ఇస్తామని కాంగ్రెస్ నేతలు నమ్మబలికారని హరీష్ రావు విమర్శించారు. తీరా అధికారంలోకి వచ్చాక ఆ హామీని ఎందుకు అమలు చేయలేదని ఆయన నిలదీశారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా రైతులకు ప్రభుత్వం కోట్ల రూపాయల నిధులను పెండింగ్లో పెట్టిందని ఆరోపించారు.
కరోనా మహమ్మారి వంటి అత్యంత కఠినమైన ఆర్థిక పరిస్థితుల్లో కూడా ఎక్కడా ఆగకుండా 13 లక్షల రైతు కుటుంబాలకు రూ. 73 వేల కోట్ల రైతుబంధు నిధులను సకాలంలో అందించిన ఘనత కేసీఆర్కే దక్కుతుందని గుర్తు చేశారు. ఎన్నికల్లో హామీ ఇవ్వకపోయినా ప్రజలకు ఏం కావాలో ముందే గుర్తించి చేసిన నాయకుడు కేసీఆర్ అని కొనియాడారు. ఇప్పుడు అచ్చంపేట చూసినా, అశ్వారావుపేట చూసినా ప్రజలందరి నోటా “మళ్లీ కేసీఆర్ రావాలి” అనే మాట ఒక్కటే వినిపిస్తోందని అన్నారు.
భద్రాద్రి రాముడి సాక్షిగా మోసం..
రెండు లక్షల రైతు రుణమాఫీని కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా ఎగ్గొట్టిందని హరీష్ రావు ధ్వజమెత్తారు. భద్రాద్రి రాముడిని సాక్షిగా పెట్టి రూ. 2 లక్షల రుణమాఫీ చేస్తానని చెప్పిన రేవంత్ రెడ్డి, చివరకు ఆ దేవుడినే మోసం చేశారని, ఇక ప్రజలను మోసం చేయకుండా ఉంటారా అని ప్రశ్నించారు. త్వరలోనే మధిరలో భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి పాల్గొనే సభకు ‘రైతు ఆశీర్వాద సభ’ అని పేరు పెట్టడం రైతాంగాన్ని అవమానించడమేనన్నారు. రైతులను మోసం చేసినందుకు గానూ ఆ సభకు ‘రైతు క్షమాపణ సభ’గా నామకరణం చేసుకోవాలని హరీష్ రావు ఎద్దేవా చేశారు.
మిల్లర్ల చేతిలో తోలుబొమ్మగా రేవంత్ రెడ్డి
ప్రస్తుతం రాష్ట్రంలో రైతుల పరిస్థితి దయనీయంగా మారిందని, మార్కెట్లో యూరియా దొరకడం లేదని, యాసంగి బోనస్ రెండు సార్లు ఇవ్వాల్సి ఉన్నా అడ్రస్ లేదని హరీష్ రావు విమర్శించారు. వడ్ల కొనుగోళ్లలో క్వింటాకు 5 కేజీల చొప్పున తరుగు తీస్తూ రైతులను నిలువునా ముంచుతున్నారని మండిపడ్డారు. “అసెంబ్లీలో వడ్లకు తరుగు తీస్తే తోలు తీస్తా అన్న రేవంత్ రెడ్డి.. ఇప్పుడు తరుగు తీస్తున్నా పట్టించుకోకుండా రైస్ మిల్లర్లు, దళారుల చేతుల్లో తోలుబొమ్మగా మారారు” అని ఘాటుగా విమర్శించారు.
ప్రాజెక్టుల విధ్వంసం.. కరెంట్ కోతలు
పెద్దవాగు ప్రాజెక్ట్ కొట్టుకుపోవడానికి పూర్తిగా ఈ ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని హరీష్ రావు ఆరోపించారు. ప్రమాద సమయంలో గేట్లు ఎత్తే నాథుడే లేకపోవడం వల్లే ఆ ప్రాజెక్ట్ కొట్టుకుపోయిందన్నారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో కొత్తగా ఒక్క ప్రాజెక్ట్ కూడా కట్టలేదు సరే కదా, ఉన్న ప్రాజెక్టులను కూడా కాపాడుకోలేక కొట్టుకుపోయేలా చేస్తున్నారని మండిపడ్డారు.
వ్యవసాయ బావులకు, బోరుబావులకు రైతుల వద్ద ‘డిస్కమ్’ (Discom) మీటర్లు పెట్టాలని చూస్తున్నారని, అదే గనుక జరిగితే రైతులకు రోజుకు కేవలం 6 గంటల కరెంట్ మాత్రమే వస్తుందని హెచ్చరించారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాద్ జూబ్లీహిల్స్లో 24 గంటల కరెంట్ ఎలా ఉంటుందో, అశ్వారావుపేట గ్రామీణ ప్రాంతాల్లో కూడా అలానే ఉండాలని ఆశించి ఉచిత విద్యుత్ ఇచ్చారని గుర్తు చేశారు.
గిరిజన, ఎస్సీ, ఎస్టీ వ్యతిరేక ప్రభుత్వం
స్థానిక ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ఎస్సీ, ఎస్టీలకు ఒక్క కార్పొరేషన్ లోన్ కూడా ఇప్పించలేకపోయారని హరీష్ రావు విమర్శించారు. ఎస్టీ కార్పొరేషన్ ద్వారా ఎంతమంది గిరిజన పిల్లలకు సహాయం అందించారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను ప్రశ్నిస్తే.. రూ. 2,750 కోట్లు కేటాయించామని చెప్తున్నారే తప్ప, క్షేత్రస్థాయిలో ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదని ఆరోపించారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ముమ్మాటికీ గిరిజన వ్యతిరేక ప్రభుత్వమని హరీష్ రావు దుయ్యబట్టారు.

