Food Safety Alert: బ్రాండ్ను చూసి నమ్మి వెళ్లే వినియోగదారులకు అత్తాపూర్లోని ప్రముఖ స్వీట్ షాప్ ‘హల్దీరామ్స్’ (Haldiram’s) చేదు అనుభవాన్ని మిగిల్చింది. పాడైపోయిన, ఫంగస్ పట్టిన మిఠాయిలను విక్రయిస్తున్నారనే ఆరోపణలపై అత్తాపూర్ పోలీసులు ఈ సంస్థపై కేసు నమోదు చేశారు. నాణ్యత లేని ఆహారాన్ని విక్రయించడమే కాకుండా, ప్రశ్నించిన వారిపై నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఇప్పుడు నగరంలో చర్చనీయాంశంగా మారింది.
Errabelli Dayakar Rao : తొర్రూరు కాంగ్రెస్ కైవసం.. కన్నీళ్లు పెట్టుకు ఎర్రబెల్లి..
బాధితులు హల్దీరామ్స్లో స్వీట్ బాక్స్ కొనుగోలు చేసి ఇంటికి తీసుకెళ్లారు. బాక్స్ను అన్బాక్స్ చేయగానే అందులో నుంచి తీవ్రమైన దుర్వాసన రావడాన్ని గమనించారు. లోపల ఉన్న మిఠాయిలను పరిశీలించగా, వాటిపై తెల్లటి ఫంగస్ పేరుకుపోయి ఉండటాన్ని చూసి వారు షాక్కు గురయ్యారు. ఒకవేళ పొరపాటున ఈ స్వీట్లను పిల్లలు తిని ఉంటే పరిస్థితి ఏంటని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
పాడైన స్వీట్ల గురించి షాప్ నిర్వాహకులను నిలదీయగా, వారు ఏమాత్రం పశ్చాత్తాపం లేకుండా చాలా నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారని బాధితులు ఆరోపిస్తున్నారు. యాజమాన్యం బాధ్యతారాహిత్యాన్ని గమనించిన బాధితులు వెంటనే పోలీసులను ఆశ్రయించారు. వారి ఫిర్యాదు మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు స్వీట్లను పరిశీలించి, పరిస్థితి తీవ్రతను బట్టి కేసు నమోదు చేశారు.
పోలీసులు హల్దీరామ్స్ నుంచి పాడైన స్వీట్ల నమూనాలను సేకరించారు. వీటిని తదుపరి విచారణ నిమిత్తం ఎఫ్.ఎస్.ఎల్ (FSL) ల్యాబ్కు పంపించారు. రిపోర్టులో స్వీట్లు కలుషితమైనట్లు తేలితే యాజమాన్యంపై మరిన్ని కఠిన సెక్షన్ల కింద చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు. ఆహార భద్రతా నిబంధనలను తుంగలో తొక్కి వినియోగదారుల ప్రాణాలతో చెలగాటమాడే సంస్థలపై కఠినంగా వ్యవహరించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.