జూబ్లీహిల్స్లో మైనర్ బాలికపై అత్యాచార ఘటన దేశంలోనే సంచలనంగా మారింది. పోలీసులే నిందితులకు అండగా ఉన్నారని బీజేపీ, కాంగ్రెస్ నేతల ఆరోపణల నేపథ్యంలో ఈ కేసులో పోలీసులు దర్యాప్తును సీరియస్ గా తీసుకున్నారు. విచారణ వేగవంతం చేశారు. అయితే ఇవాళ (ఆదివారం) ఈ కేసులో మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో అమ్నీషియా పబ్ కేసులో ఐదుగురిని అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. మరో మైనర్తో పాటు ఉమేర్ఖాన్ను అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు. ఇప్పటికే అరెస్ట్ అయిన వారిలో ఇద్దరు మైనర్లు, ఒక మేజర్ ఉన్నారు. అయితే, నిందితులంతా రాజకీయ నేతల కొడుకులుగా పోలీసులు గుర్తించారు.
జూబ్లీహిల్స్ అత్యాచారం కేసు నిందితుల లిస్ట్..
A1.. సాదుద్దీన్(ఎంఐఎం నేత కుమారుడు)
A2.. ఉమేర్ఖాన్(ఎమ్మెల్యే సోదరుడి కుమారుడు)
మైనర్-1.. వక్ఫ్ బోర్డు చైర్మన్ కుమారుడు
మైనర్-2.. ఎంఐఎం కార్పొరేటర్ కుమారుడు
మైనర్-3.. సంగారెడ్డి మున్సిపల్ కో-ఆప్షన్ మెంబర్ కుమారుడు ఉన్నట్టు వివరాలు వెల్లడించారు.
గవర్నర్ తమిళిసై
ఇదిలా ఉండగా.. మైనర్పై అత్యాచార కేసుపై తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్య రాజన్ స్పందించారు. ఈ ఘటనపై నివేదికను సమర్పించాలని సీఎస్, డీజీపీని ఆదేశించారు. 2 రోజుల్లో నివేదికను అందించాలని ఆదేశించారు. మరోవైపు.. బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన నిందితులు.. లైంగిక దాడి అనంతరం కారులో మొయినాబాద్కు వెళ్లారు. అక్కడ ఓ రాజకీయ నేతకు చెందిన ఫాంహౌస్లో ఆశ్రయం పొందారని తెలుస్తోంది.
వెంకట్ బల్మూరి
సమాజంలో అసాంఘిక కార్యకలాపాలకు నియమాలను పాటించని పబ్ లు ఆజ్యం పోస్తున్నాయని తెలంగాణ NSUI రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్ బల్మూరి ఆగ్రం వ్యక్తం చేశారు. తెలంగాణ NSUI బృందం శంషాబాద్ ఎయిరో ప్లాజా కాంప్లెక్స్ లోని సిప్ ఆఫ్ స్కై,చికెన్ వైల్డ్ వింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ పబ్ ల వద్దకు తనిఖీ కోసం వెళ్లారు. అర్థరాత్రి 12 గంటలకు మూసెయ్యాల్సిన పబ్ లు ఉదయం 3 గంటలకు కూడా ఇంకా నడుస్తూనే ఉండడంతో అక్కడి పబ్ నిర్వాహకులపై బల్మూరి వెంకట్ మాట్లాడే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి పబ్ యాజమాన్యాలపై సంబంధిత శాఖ మంత్రులు, కెటిఆర్ వెంటనే చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.
భట్టి విక్రమార్క
టీఆర్ఎస్ కు భజన చేసే వారికి పబ్ ల అనుమతి ఇస్తున్నారని మండిపడ్డారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. రాష్ట్ర రాజధానిలో జరిగిన బాలిక అత్యాచారం ఘటనలో పోలీసుల దర్యాప్తు నిష్పక్షపాతంగా లేదని ఆరోపణలు వెల్లువెత్తుతున్న క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం సి.బి.ఐ విచారణకు అనుమతించాలని భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. రాష్ట్ర రాజధానిలో మైనర్ బాలికపై అత్యాచారం జరగడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. పబ్ లలోకి మైనర్లకు అనుమతి లేదు..మరి ఎలా అనుమతి చేశారు? అని ప్రశ్నించారు.
రఘునందన్ రావు
హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో మైనర్ బాలిక పై గ్యాంగ్ రేప్ ఘటనలో నగరానికి చెందిన ఎంఐఎం ఎమ్మెల్యే కొడుకు ఉన్నారని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు సంచలన విషయాలు చెప్పారు. ఎంఐఎం ఎమ్మెల్యే కొడుకు గ్యాంగ్ రేప్ ఘటనలో ఉన్నారంటూ.. అందుకు కొన్ని ఆధారాలు చూపించారు. ఆమ్నేషియా పబ్ కు వచ్చిన మెర్సిడేజ్ బెంజ్ కారులో ఎమ్మెల్యే కొడుకు ఉన్న ఫోటోలను రఘునందన్ రావు విడుదల చేశారు. ఈ కారులోనే నిందితులు పబ్ కు వచ్చారని వెస్ట్ జోన్ డీసీపీ తెలిపారు. ఈ కారులోనే ఎమ్మెల్యే కొడుకు పబ్ కు వస్తున్న ఫోటోలను రఘునందన్ రావు లైవ్ లో రిలీజ్ చేయడం కలకలం రేపింది.