Etela Rajender Sensational Comments On CM KCR: ‘పల్లె గోస – బీజేపీ భరోసా’ బైక్ ర్యాలీలో భాగంగా బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్.. కేసీఆర్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. కేసీఆర్ ప్రభుత్వానికి పోయే కాలం వచ్చిందని విమర్శించారు. మూడున్నర సంవత్సరాలుగా సీఎం కేసీఆర్ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని, రెండోసారి అధికారంలోకి వచ్చాక అరచేతిలో బెల్లం పెట్టీ మోచేతి నాకించేశారని ఎద్దేవా చేశారు. 57 ఏళ్లకు పెన్షన్ ఇస్తానని చెప్పి ఇవ్వలేదన్నారు. మూడేళ్లుగా 65 సంవత్సరాలు దాటిన వారికి పెన్షన్ ఇవ్వట్లేదన్నారు. అలాగే.. ప్రమాదవశాత్తు గాయపడ్డ వారికి వికలాంగ పెన్షన్, విధివంచించిన వితంతువులకు పెన్షన్ రాలేదన్నారు.
తమ బీజేపీ బైక్ ర్యాలీలు, పాదయాత్రలు చేపట్టిన అనంతరం ఆగస్ట్ 15వ తేదీన 10 లక్షల పెన్షన్ ఇస్తామని కేసీఆర్ ప్రకటించారని ఈటెల రాజేందర్ పేర్కొన్నారు. పెన్షన్ కూడా నెల నెలా రావడం లేదని, మూడు నెలలు ఆలస్యంగా వస్తోందన్నారు. ఇక నుంచి ఏమాత్రం ఆలస్యం కాకుండా.. ప్రతి నెలా 1వ తేదీనే పెన్షన్ వేయాల్సిందిగా కేసీఆర్ ప్రభుత్వాన్ని తాను డిమాండ్ చేస్తున్నానన్నారు. డబుల్ బెడ్రూమ్ ఇస్తానని చెప్పి, పేదల కళ్ళల్లో మట్టి కొట్టారని మండిపడ్డారు. కెసిఆర్ మాటలు కోటలు దాటుతాయి కానీ, కాళ్ళు తంగెళ్లు దాటవన్నారు. కెసిఆర్ ది నాలుకనా, తాటియ్ మట్టనా అని ప్రశ్నించారు. కెసిఆర్ ఎవరినీ కలవరని, అలాంటి ముఖ్యమంత్రి మనకు అవసరమా? అని తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారన్నారు.
కాగా.. పల్లె గోస – బీజేపీ భరోసా రెండో రోజు బైక్ ర్యాలీలో భాగంగా ఈటెల రాజేందర్ 15 కీలోమీటర్ల మేర బైక్ నడిపారు. ప్రతి గ్రామంలో బీజేపీ జెండా ఎగురవేశారు. అనంతరం.. టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల నుండి బీజేపీలోకి చేరిన వారిని కాషాయ కండువా కప్పి, పార్టీలోకి ఆహ్వానించారు. ఇదే సమయంలో రాష్ట్రంలో ఉన్న అన్ని సమస్యల్ని కేసీఆర్ ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ప్రజల ఆశీర్వాదంతో వచ్చే ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వం వస్తుందని ధీమా వ్యక్తం చేసిన ఆయన.. తమ పార్టీ అధికారంలోకి వచ్చాక అన్ని సమస్యలు పరిష్కారమవుతాయన్నారు.