ఏపీలో మాదిరిగానే తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల్లో కూడా ఇంగ్లీష్ మీడియం అందుబాటులోకి రానుంది. ఈ మేరకు వచ్చే ఏడాది నుంచి ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టాలని తెలంగాణ కేబినెట్ సబ్ కమిటీ బుధవారం నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో ఇంగ్లీష్ మీడియంలో టీచింగ్కు సంబంధించి అధ్యయనం చేయాలంటూ ఇటీవల సీఎం కేసీఆర్ మంత్రి సబిత ఇంద్రారెడ్డి నేతృత్వంలో కేబినెట్ సబ్ కమిటీని నియమించారు. దీంతో ఈ కమిటీ బుధవారం ప్రత్యేకంగా సమావేశమైంది.
ఈ నేపథ్యంలో 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకు విద్యార్థులకు తొలుత ఇంగ్లీష్ మీడియం అందుబాటులోకి తీసుకురావాలని విద్యాశాఖ మంత్రి సబిత ఇంద్రారెడ్డి నేతృత్వంలోని కేబినెట్ సబ్ కమిటీ ఖరారు చేసింది. తొలుత తెలుగు మీడియం చదివే విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేలా ప్రతి పుస్తకంలో ఆంగ్లంలోని పాఠంతో పాటు సమాంతరంగా తెలుగులోనూ పాఠాన్ని అందించాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. కాగా విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధ్యక్షతనలో ఏర్పాటైన కేబినెట్ సబ్ కమిటీలో మంత్రులు హరీష్ రావు, కేటీఆర్, నిరంజన్ రెడ్డి, జగదీష్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, తలసాని శ్రీనివాస్ యాదవ్ సభ్యులుగా ఉన్నారు.