టాలీవుడ్లో డ్రగ్స్ ప్రకంపనలు కొనసాగుతున్నాయి. ఈడీ ఎంట్రీతో టాలీవుడ్లో మరోసారి స్క్రీన్ షేక్ అవుతోంది. డ్రగ్స్ కేసులో నేటి నుంచి ఈడీ విచారణ ప్రారంభం కానుంది. ఇప్పటికే ముగ్గురు నిందితుల నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేసిన ఈడీ.. ఆ సమాచారంతో 12 మంది టాలీవుడ్ నటీనటులకు నోటీసులు జారీ చేసింది. ఇక, ఇవాళ డైరెక్టర్ పూరీ జగన్నాథ్.. ఈడీ ముందు హాజరు కానున్నారు. సెప్టెంబర్ 2న నటి చార్మీ, సెప్టెంబర్ 6న హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఈడీ ముందు విచారణకు హాజరు కానున్నారు. సెప్టెంబర్ 8న మరో స్టార్ యాక్టర్ రానా దగ్గుబాటి, సెప్టెంబర్ 9న మరో హీరో రవితేజా, అతని డ్రైవర్ శ్రీనివాస్ను ఈడీ ప్రశ్నించనుంది. సెప్టెంబర్ 13వ తేదీన నటుడు నవదీప్, ఎఫ్ క్లబ్ జనరల్ మేనేజర్ ఈడీ ముందు హాజరవుతారు. సెప్టెంబర్ 15వ తేదీనా ముమైఖాన్, సెప్టెంబర్ 17వ తేదీన నటుడు తనీష్, సెప్టెంబర్ 20న హీరో నందు, సెప్టెంబర్ 22న హీరో తరుణ్ను ఈడీ విచారించనుంది.
మరోవైపు… ఈ కేసుతో లింకులు ఉన్న మరికొందరిని విచారించేందుకు ఈడీ కసరత్తు చేస్తోంది. ఎక్సైజ్ శాఖ విచారించిన 50 మందికి నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది. డ్రగ్స్ కేసులో హవాలా మనీ లాండరింగ్, ఫెమా ఉల్లంఘనలు జరిగినట్లుగా గుర్తించారు అధికారులు. డ్రగ్స్ కోసం పెద్ద మొత్తంలో విదేశాలకు నిధులను మళ్లించినట్లుగా గుర్తించారు. డ్రగ్స్ కొనుగోలు చేసి నిందితులకు హవాలా ద్వారా డబ్బులు తరలించారు. అయితే, విదేశాలకు నిధులను ఎలా తరలించారనే విషయంపై ఈడీ విచారిస్తోంది. ఇప్పటికే సెలబ్రిటీలకు డ్రగ్స్ విక్రయించిన పెడర్స్ కెల్విన్, విక్టర్, కమింగాల స్టేట్మెంట్ సేకరించారు. ఆ విషయాల ఆధారంగా సినీ నటులను విచారించనున్నారు. అంతేకాదు ఫారెన్ బ్యాంకులకు ఎంత డబ్బు అక్రమంగా తరలిందనే విషయమై ఆరా తీస్తోంది. దీని కోసం ఇంటర్ పోల్ సాయం తీసుకుంటోంది. ఇక, మరోసారి డ్రగ్స్ కేసు తెరపైకి రావడం టాలీవుడ్లో ప్రకంపనలు సృష్టిస్తోంది.. ఎక్కడి నుంచి ఏ లింకులు బయటపడతాయే అనే టెన్షన్ కొందరిలో ఉంటే.. మరికొందరిలో ఈ పరిణామాలు ఆసక్తికరంగా మారాయి.