జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలో రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఈ బడ్జెట్ తెలంగాణ ప్రజల ఆశలపై నీళ్లు చల్లిందని, పూర్తిగా నిరాశజనకంగా ఉందని ఆయన విమర్శించారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర విభజన జరిగి ఇన్నేళ్లవుతున్నా, విభజన చట్టంలోని 42 కీలక అంశాలు నేటికీ పరిష్కారం కాకుండా పెండింగ్లో ఉండటం కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని మండిపడ్డారు. ఈ సమావేశాల్లోనైనా ఆ సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని ఆశించామని, కానీ కేంద్రం మళ్ళీ మొండిచేయి చూపిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా కేంద్రం వెంటనే స్పందించి విభజన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు.
T20 World Cup 2026: PSL బ్యాన్, ఆర్థిక ఆంక్షలు.. ఐసీసీ దెబ్బతో పాక్ క్రికెట్ ఖతం.!
రాష్ట్రానికి రావాల్సిన ప్రతిష్టాత్మక సంస్థల విషయంలో కేంద్రం అనుసరిస్తున్న తీరును శ్రీధర్ బాబు ఎండగట్టారు. తెలంగాణకు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (IIM) వంటి ఉన్నత విద్యాసంస్థ వస్తుందని రాష్ట్రం ఎంతో ఆశగా ఎదురుచూసిందని, కానీ బడ్జెట్లో దాని ఊసే లేకపోవడం దారుణమన్నారు. అలాగే హైదరాబాద్ నగరవాసుల చిరకాల స్వప్నమైన మెట్రో ఫేజ్-2 విస్తరణకు నిధులు కేటాయిస్తారని ఆశించినా ఫలితం లేకుండా పోయిందన్నారు. విద్యా రంగంలో కేంద్రీయ , నవోదయ విద్యాలయాల కేటాయింపులో కూడా రాష్ట్రానికి మొండిచేయి ఎదురైందని విమర్శించారు. ఐటి , పారిశ్రామిక రంగంలో కీలకమైన సెమీ కండక్టర్ చిప్స్ మ్యానుఫ్యాక్చరింగ్ పరిశ్రమలను తెలంగాణకు కేటాయించడంలో కేంద్రం పక్షపాత ధోరణి ప్రదర్శిస్తోందని, గతంలోనూ ఇదే జరిగిందని ఆయన గుర్తు చేశారు.
తెలంగాణ నుంచి ఎనిమిది మంది బీజేపీ పార్లమెంట్ సభ్యులు ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ, కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులను సాధించడంలో వారు పూర్తిగా విఫలమయ్యారని మంత్రి విమర్శించారు. ఇంతమంది ఎంపీలు ఉండి కూడా నిధులు రాకపోవడం బాధాకరమని, ఇది రాష్ట్ర ప్రజలకు జరిగిన అవమానమని పేర్కొన్నారు. అయితే, తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న లైఫ్ సైన్సెస్ , ఫార్మా పాలసీలను కేంద్ర ప్రభుత్వం ఆదర్శంగా తీసుకోవడం మన పాలనకు నిదర్శనమని చెప్పారు. అభివృద్ధి విషయంలో రాజీ పడకుండా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతోందని, కేంద్రం కూడా తన బాధ్యతను గుర్తించి సంక్షేమ కార్యక్రమాలకు నిధులు విడుదల చేయాలని కోరారు.
రాబోయే మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో మంత్రి శ్రీధర్ బాబు ప్రజలకు కీలక పిలుపునిచ్చారు. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో పట్టణ ప్రాంత ప్రజలకు ఒరిగిందేమీ లేదని, అభివృద్ధిని పూర్తిగా విస్మరించారని ఆరోపించారు. పట్టణ ప్రజలకు న్యాయం జరగాలంటే బీఆర్ఎస్ అభ్యర్థులను ఓడించి, కాంగ్రెస్ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించుకోవాలని కోరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా మున్సిపల్ శాఖ బాధ్యతలను నిర్వహిస్తూ, పట్టణాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు , సంక్షేమ పథకాల అమలుకు ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని వివరించారు. ప్రజలకు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేరుస్తామని, మున్సిపాలిటీలను అభివృద్ధి పథంలో నడిపిస్తామని మంత్రి ధీమా వ్యక్తం చేశారు.