డిగ్రీ ప్రవేశాల కోసం దోస్త్ నోటిఫికేషన్ బుధవారం విడుదలైంది. మాసబ్ ట్యాంక్లోని ఉన్నత విద్యామండలిలో డిగ్రీ దోస్త్ షెడ్యూల్ను ఉన్నత విద్యామండలి ఛైర్మన్ లింబాద్రి ప్రకటించారు. రాష్ట్రంలోని ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ, పాలమూరు, మహాత్మగాంధీ, శాతవాహన విశ్వవిద్యాలయాల పరిధిలోని 1060 కళాశాలల్లో బీఏ, బీఎస్సీ, బీకాం, బీకాం వొకేషనల్, బీకాం హానర్స్, బీఎస్డబ్ల్యూ, బీబీఏ, బీబీఎం, బీసీఏతో పాటు ఇతర కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఈ నోటిఫికేషన్ ద్వారా దాదాపు 4,25,000 సీట్లను భర్తీ చేయనున్నారు. 3 లేదా 4 విడతల్లో డిగ్రీ సీట్లను భర్తీ చేయనున్నారు. దోస్త్ వెబ్ సైట్, టీఎస్ యాప్ ఫోలియో లేదా యూనివర్సిటీలు, ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లోని సహాయ కేంద్రాల ద్వారా విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకునేలా ఏర్పాట్లు చేశారు.
అర్హత కలిగిన విద్యార్థులు జులై 1 నుంచి 15వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు జులై 3 నుంచి 16వ తేదీ వరకు వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవచ్చు. జులై 22న సీట్ల కేటాయింపు ఉంటుంది. 23వ తేదీ నుంచి జులై 27వ తేదీ వరకు సెల్ఫ్ రిపోర్టు చేయాలి. ఈ నెల 24 నుంచి సెప్టెంబర్ 7 వరకు మొదటి విడత దోస్త్ రిజిస్ట్రేషన్లు చేపడతామని అధికారులు వెల్లడించారు. జులై 6 నుంచి 30 వరకు వెబ్ ఆప్షన్లు నమోదుకు అవకాశం కల్పించారు. దరఖాస్తు చేసుకునేందుకు రూ. 200 చెల్లించాల్సి ఉంటుంది.
ఆగస్టు 6న మొదటి విడత డిగ్రీ సీట్ల కేటాయింపు జరగనుంది. ఈ కేటాయింపుకు సంబంధించి ఆగస్టు 7 నుంచి 18 వరకు విద్యార్థులు సంబంధిత కళాశాల్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. ఆగస్టు 7 నుంచి 21 వరకు రెండో విడత దోస్త్ రిజిస్ట్రేషన్ ఉంటుంది. ఆగస్టు 7 నుంచి 22 వరకు రెండో విడత వెబ్ ఆప్షన్ల నమోదుకు అవకాశం ఇచ్చారు. ఆగస్టు 22న రెండో విడత డిగ్రీ సీట్ల కేటాయింపు ఉండనున్నట్లు షెడ్యూల్లో ప్రకటించారు. ఆగస్టు 29 నుంచి సెప్టెంబర్ 12 వరకు మూడో విడత దోస్త్ రిజిస్ట్రేషన్ జరగనుండగా.. ఆగస్టు 29 నుంచి సెప్టెంబర్ 12 వరకు మూడో విడత వెబ్ ఆప్షన్లకు అవకాశం ఇచ్చారు. సెప్టెంబర్ 16న మూడో విడత డిగ్రీ సీట్ల కేటాయింపు ఉండనుంది. అక్టోబర్ 1 నుంచి డిగ్రీ తరగతులు ప్రారంభం కానున్నట్లు ఉన్నత విద్యామండలి ఛైర్మన్ లింబాద్రి ప్రకటించారు.