ముఖ్యమంత్రిగా ఉండే అర్హత కేసీఆర్కు లేదు.. తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్న కేసీఆర్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ.. హుజురాబాద్లో దళిత బంధు నిలుపుదలకు కేసీఆరే కారణం అన్నారు.. రెండు నెలలలోపు హుజురాబాద్ లో అందరికి “దళిత బంధు” ఇస్తా అని కేసీఆర్ మాట ఇచ్చారు.. ఇచ్చిన మాట నిలబెట్టుకోలేక దళిత బంధును బీజేపీ ఆపిందని నిందలు వేస్తున్నారని విమర్శించారు.. జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా వరదల్లో నష్టపోయిన వారికి 10 వేల రూపాయలు ఇస్తామన్నారు.. ఇప్పటికి ఇవ్వలేదని ఆరోపించిన ఆమె.. 10 వేల రూపాయలు ఇవ్వొద్దని బండి సంజయ్ ఈసీకి లేఖ రాసినట్లుగా దొంగ లేఖ సృష్టించారని మండిపడ్డారు.
హుజురాబాద్లో రెండు నెలలుగా దళిత బంధు అమలు చేయకుండా ఏం చేశారు.. హుజురాబాద్ మాత్రమే కాదు రాష్ట్ర వ్యాప్తంగా దళిత బంధు అమలు చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తుందన్నారు డీకే అరుణ.. ఒక నియోజకవర్గంలో ఎన్నికల కోసం తెచ్చిన అబద్దపు హామీ, మోసం తేట తెల్లమైందన్నారు. బీజేపీ “దళిత బంధు” ఆపింది అన్న అసత్య ప్రచారాలు టీఆర్ఎస్ ఆపాలని వార్నింగ్ ఇచ్చారు. దళితులకు ఆశ పెట్టి మోసం చేయాలనుకున్నారు.. కేసీఆర్ ప్రజలను మోసం చేయడం మానుకోవాలన్నారు. యాదగిరి నరసింహ స్వామి మోసాలు చేయమని చెప్పాడా? అసత్యాలు ప్రచారం చేస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. “దళిత బంధు” ఆపమని బీజేపీ లేఖ రాస్తే ఆ లేఖను బయటపెట్టాలని డిమాండ్ చేశారు.. దళితులనే కాదు బీదరికంలో ఉన్న ప్రతి ఒక్కరికి అమలు చేయాలని కోరుతున్నాం అన్నారు. ఎన్నికల కోసం పథకాలు కాదు.. రాష్ట్ర సంక్షేమం కోసం పథకాలు ఉండాలని.. వర్షాలు పడి పంట నష్టపోయి తీవ్ర ఇబ్బందుల్లో రైతులు ఉన్నారు.. పంట నష్ట అంచనా వేయలేదు… “రైతు బంధు”ఇచ్చామని ప్రభుత్వం చేతులు దులుపుకుంటోందని ఆగ్రహం వ్యక్తం చేశారు డీకే అరుణ.