చలికాలం వచ్చేసింది.. రోజూ రోజుకు చలి పెరుగుతూనే ఉంది కానీ తగ్గింది లేదు.. సాయంత్రం 6 తర్వాత బయటకు వెళ్లాలంటే జనాలు భయంతో గజగజా వణికిపోతున్నారు.. ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోవడం.. మునుపెన్నడూ లేని రీతిలో పొగమంచు పలు ప్రాంతాల్ని కప్పేస్తోంది.. దట్టంగా వ్యాపిస్తుండడంతో చాలా చోట్ల ఉదయం 11 గంటల దాకా కూడా రాత్రిని తలపిస్తోంది. అదే సమయంలో దేశవ్యాప్తంగా రవాణా వ్యవస్థపై పెను ప్రభావం పడుతోంది. ఇక ఈరోజు రేపు భారీగా పొగ మంచు ఏర్పడే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది..
ముఖ్యంగా ఢిల్లీ వాసులు ఈ పొగ మంచుతో పెద్ద యుద్ధమే చేస్తున్నారు.. కనిష్ఠ ఉష్ణోగ్రత 7 డిగ్రీలకు పడిపోయిందక్కడ. పొగమంచు కొన్ని ప్రాంతాల్లో 50 మీటర్ల దూరంలో ఉన్న వాహనాలు కూడా కనిపించనంతగా మంచు కమ్మేసింది. చలి పరిస్థితులు తీవ్రంగా ఉండటంతో ఇప్పటికే అక్కడి వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. మరోవైపు పొగమంచు కారణంగా అనేక రాష్ట్రాల్లో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.. ఈ మంచు తీవ్రత పెరగడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉందని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు..
ఇక తెలుగు రాష్ట్రాల్లో.. తెలంగాణ రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో శుక్ర, శనివారాల్లో ఉదయం వేళ పొగమంచు కమ్ముకునే అవకాశాలు ఉన్నాయని.. అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు వాతావరణశాఖ సూచించింది. రాష్ట్రం వైపు తూర్పు, ఆగ్నేయ దిశల నుంచి దిగువ స్థాయిలో గాలులు వీస్తున్నాయని తెలిపింది. ఎక్కువగా ఉమ్మడి ఆదిలాబాద్, ఖమ్మం, నల్గొండ, రంగారెడ్డి, హైదరాబాద్, మెదక్ జిల్లాల్లో భారీగా మంచు కురిసే అవకాశం ఉందని చెబుతున్నారు.. ప్రజలు చలికి తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు..