జూబ్లీహిల్స్ మైనర్ బాలికపై రేప్ కేసులో ఏ-1 నిందితుడు సాదుద్ధీన్ మాలిక్కు మూడు రోజుల కస్టడీకి కోర్టు అనుమతి ఇచ్చింది. సాదుద్దీన్ను కస్టడీకి ఇవ్వాలని కోరుతూ నాంపల్లి కోర్టులో పోలీసులు పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. వారం రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని కోరారు. సంచలనం సృష్టించిన జూబ్లీహిల్స్ బాలిక గ్యాంగ్ రేప్ కేసులో ఆరుగురు నిందితుల్లో సాదుద్దీన్ మాలిక్ ఒక్కడే మేజర్. దీంతో అతడిని కస్టడీలోకి తీసుకుని విచారిస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ మేరకు కోర్టు విచారణ జరిపి మూడు రోజులపాటు కస్టడీకి అనుమతించింది.
ఇవాళ్టి నుంచి ఈ నెల 11 వరకు మూడు రోజుల పాటు జూబ్లీహిల్స్ పోలీసులు కస్టడీకి తీసుకొని విచారించనున్నారు. నేడు చంచల్ గూడ జైలు నుంచి సాదుద్దీన్ను కస్టడీలోకి తీసుకోనున్నారు. మరోవైపు జువైనల్ హోమ్లో ఉన్న ఐదుగురు నిందితులను సైతం వారం రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని జువైనల్ కోర్టును పోలీసులు కోరారు. నేడు జువైనల్ కోర్టులో కస్టడీ ఆ పిటిషన్పై విచారణ చేపట్టి తీర్పును వెలువరించే అవకాశం ఉంది. మైనర్ బాలికను ఏ విధంగా ట్రాప్ చేశారు.. అనే పలు అంశాలపై పోలీసులు నిందితులను విచారించనున్నట్లు సమాచారం.