తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డిపై సంగారెడ్డి ఎమ్మెల్యే, కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ అధిష్టానం సీరియస్ అయ్యింది.. రేవంత్ రెడ్డిపై జగ్గారెడ్డి తాజాగా చేసిన వ్యాఖ్యలపై ఆరా తీశారు రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్యం ఠాకూర్.. అంతే కాదు.. ఇవాళ సాయంత్రం గాంధీభవన్లో పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సమావేశం నిర్వహించనున్నారు.. ఈ సమావేశంలో జగ్గారెడ్డి కామెంట్లపై సీరియస్గా చర్చించాలని రాష్ట్ర నేతలను మాణిక్యం ఠాకూర్ ఆదేశించినట్టు తెలుస్తుంది… ఏఐసీసీ కార్యదర్శి బోస్ రాజుతో ఠాకూర్ వివరాలు తెప్పించుకున్నారని తెలుస్తోంది.. ఇవాల మధ్యాహ్నం 2 గంటలకు హైదరాబాద్ రానున్నారు ఠాకూర్..
కాగా, రేవంత్ రెడ్డిపై అసంతృప్తిని వెళ్లగక్కిన జగ్గారెడ్డి.. తనకు తెలియకుండా తన నియోజకవర్గంలో పర్యటన ఏంటని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని మండిపడ్డారు. ఇలా ఒకరి నెత్తిన మరొకరు చేయి పెట్టుకుంటే కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందా ? అని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ రాజకీయ పార్టీనా లేక ప్రైవేటు లిమిటెడ్ కంపెనీనా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన సంగారెడ్డి ఎమ్మెల్యే.. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వారికి కూడా పార్టీలో గౌరవం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. కొందరు వ్యక్తిగత ప్రతిష్ట కోసం పాకులాడుతున్నారని ఫైర్ అయిన జగ్గారెడ్డి.. ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి తాను ఏకైక ఎమ్మెల్యేగా ఉన్నానని.. అలాంటి తనకు గజ్వేల్ సభలో తనకు మాట్లాడే అవకాశం ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. ఇక, అన్యాయాలను ప్రశ్నిస్తే సోషల్ మీడియా ద్వారా విషప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.. సోనియా, రాహుల్ గాంధీ మీద ఉన్న గౌరవం, విలువలతోనే పార్టీలో కొనసాగుతున్నానని.. రాజకీయాల్లో హీరోయిజం పని చేయదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు.. తనకూ అభిమానులు ఉన్నారని.. కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ లేకుండా రెండు లక్షల మందితో సభ పెట్టి చూపిస్తానని సంచలన వ్యాఖ్యలు చేశారు.. దీంతో కాంగ్రెస్ అధిష్టానం సీరియస్ అయ్యింది. మరి.. ఇవాళ్టి సమావేశంలో ఎలాంటి చర్చ సాగనుంది అనేది ఆసక్తికరంగా మారింది.